రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి విమర్శలైతే వినిపిస్తాయో అవే వ్యాఖ్యలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట వినిపిస్తున్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు.మొన్నటివరకు సీఎం రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు చేసేవారు.తాజాగా అవే కామెంట్స్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి ఓటు షేరింగ్ చేసుకున్నాయి.ఇదే విషయాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఆధారాలతో సహా రుజువు చేసింది.
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న తెలంగాణలో పర్యటించారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం తెలంగాణ,ఏపీ నేతల పీఏసీ నేతలతోనూ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే రాహుల్ వెంట సీఎం రేవంత్ రెడ్డి డబ్బుల మూటలు పంపించారని ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ..ఢిల్లీకి మూటలు పంపడం కోసమే రేవంత్ సర్కార్ పనిచేస్తున్నదని ఆరోపించారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధులు లేవని సీఎం రేవంత్, మంత్రులు అంటున్నారని.. మరి ఢిల్లీకి డబ్బులు పంపడానికి ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ రేవంత్ సర్కార్ ఆర్ ఆర్(రేవంత్, రాహుల్) టాక్స్ వసూలు చేస్తున్నదని గతంలో పీఎం మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆరోపించారు. కొంత కాలం ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు సైతం ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీకి ఆర్ ఆర్ టాక్స్ గురించి తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ పలుమార్లు ప్రశ్నించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. తాజాగా బీజేపీ ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నది. అనగా ఈ రెండు పార్టీలు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒకే విధమైన ఆరోపణలు చేస్తున్నాయని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సిద్ధాంత పరంగా వేరైనా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
Rashmika Vijay: పెళ్లి జరిగి నాలుగు రోజులు కాలేదు.. పిల్లల పై రష్మిక కామెంట్స్ విన్నారా?
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అమలుకు , పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేందుకు ఖజానాలో డబ్బులు లేవని సీఎం రేవంత్, మంత్రులు పదేపదే అన్ని కార్యక్రమాల్లో చెబుతూ వస్తుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల జేబులు డబ్బులతో నిండుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని పదేపదే ప్రభుత్వం చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.కాగా, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడపలుక్కుని ఒకే అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు.