Indonesia Volcano Eruption: ఇండోనేసియాలోని మలుకు ప్రావిన్స్లో గల మౌంట్ డుకోనో అగ్నిపర్వతం శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఈ భీకర ఘటనలో ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. హల్మహెరా ద్వీపంలోని ఈ పర్వతం నుంచి సుమారు 10 కిలోమీటర్ల ఎత్తుకు దట్టమైన బూడిద ఎగసిపడింది. విస్ఫోటనం సమయంలో విదేశీయులతో కూడిన 20 మంది బృందం పర్వతంపై ఉండటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు సింగపూర్ జాతీయులు, ఒక స్థానిక వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద దాదాపు 18 కిలోమీటర్ల మేర వ్యాపించి సమీప గ్రామాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా వోల్కనాలజీ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) విభాగం స్థానికులను అప్రమత్తం చేసింది. అగ్నిపర్వతం విస్ఫోటనం నిరంతరాయంగా కొనసాగుతుండటంతో మృతదేహాలను వెలికితీసే ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు ఏడుగురిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు స్థానిక యంత్రాంగం వెల్లడించింది.
మౌంట్ డుకోనో అగ్నిపర్వతం గత మార్చి నుంచి నిరంతరం చురుగ్గా కదులుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ (BNPB) ఇప్పటికే లెవెల్ 2 హెచ్చరికలు జారీ చేసింది. అగ్నిపర్వతం పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు విధించినప్పటికీ పర్వతారోహకులు వాటిని ఖాతరు చేయకుండా పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పర్వత శిఖరం సమీపంలో ఉన్నవారు బూడిద వేడి వాయువుల ప్రభావానికి గురై ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పర్వత పాదాల వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బూడిద వర్షం కురుస్తున్నందున స్థానిక నివాసితులు మాస్కులు ధరించాలని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం సూచించింది. బాధితులను తరలించడానికి ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు. పర్యాటకులు సాహస యాత్రికులు అధికారిక హెచ్చరికలను పాటించాలని ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం ప్రాణాపాయానికి దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్