India – Uzbekistan: భారత ప్రభుత్వం.. ఉజ్బెకిస్థాన్ తో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలో అణు ఇంధన రంగానికి అవసరమైన యురేనియంను సరఫరా చేసేలా ఉజ్బెకిస్థాన్ తో అంగీకారం కుదిరినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న మోదీ.. తాష్కెంట్ లో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ (Shavkat Mirziyoyev)తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, ఇంధనం, డిజిటల్ అనుసంధానం లాంటి రంగాలపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. కొన్ని కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ఇందులో యురేనియం ఒప్పందం భారత్ కు ఎంతగానో మేలు చేకూరుస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో భారత ప్రభుత్వం సాగుతోంది. అయితే అణు కార్యక్రమాలకు యురేనియం చాలా కీలకం. అయితే ఆ నిల్వలు ఉజ్బెకిస్థాన్ వద్ద పుష్కలంగా ఉన్నాయి. వాటిని సరఫరా చేసే విషయమై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడం భారత్ కు శుభ పరిణామమనే చెప్పాలి. ఈ డీల్ ద్వారా భారత్ లో అణు విద్యుత్ ప్రణాళికలు సుదీర్ఘ కాలంపాటు సజావుగా సాగనున్నాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అణు ఇంధన రంగమే కాకుండా పట్టణాభివృద్ధిలోనూ రెండు దేశాలు చేతులు కలిపాయి. ఉజ్బెకిస్థాన్ నిర్మిస్తున్న ‘న్యూ తాష్కెంట్’ నగరానికి గుజరాత్లోని ‘గిఫ్ట్ సిటీ’ (GIFT City) ఒక మంచి రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అటు వికసిత్ భారత్, యాంగి ఉజ్బెకిస్తాన్ అభివృద్ధి లక్ష్యాల సాధనలో రెండు దేశాలు కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య కుదురుతున్న ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా వేగంగా అమలు చేయడానికి స్పష్టమైన రోడ్మాప్ సిద్ధం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని తమ విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. గత ఏడాది రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు తొలిసారిగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) మార్కును దాటాయని తెలిపారు. గతంతో పోలిస్తే ఉమ్మడి వ్యాపారాలు 7 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వారానికి 14 విమాన సర్వీసులు నేరుగా సాగుతున్నట్లు వివరించారు.
అంతకుముందు భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఉజ్బెకిస్థాన్ ప్రకటించింది. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ స్వయంగా ‘ఆర్డర్ ఆఫ్ ఓలి దారాజలీ దుస్త్లిక్’ అవార్డును ఈ భేటి సందర్భంగా ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం, ఆత్మీయ సంబంధాలను మరింత చేరువ చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఈ పురస్కారం దక్కడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
Also Read: అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!
మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో పర్యాటకులు, వ్యాపారవేత్తలకు అత్యంత తీపి కబురు అందిస్తూ ఉజ్బెకిస్థాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. భారత పౌరులకు 30 రోజుల ఉచిత వీసా (Visa Free entry) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య పర్యాటకరంగం గణనీయంగా పుంజుకునే అవకాశం ఉంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!