Nigeria Mine Accident: నైజీరియాలో ఘోర గని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గనిలో అకస్మాత్తుగా విష వాయువులు విడుదల కావడంతో అక్కడ పనిచేస్తున్న 37 మంది కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. గని లోపల పనులు జరుగుతున్న సమయంలో ఈ వాయువులు లీక్ కావడంతో కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. క్షణాల వ్యవధిలోనే గాలి కలుషితమై శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో వారంతా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు రెస్క్యూ టీమ్లతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. గని లోపల చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోపలి నుంచి బయటకు తీసిన పలువురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నైజీరియాలో గనుల తవ్వకం జరిగే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గని లోపల విష వాయువుల సాంద్రతను గుర్తించే పరికరాలు లేకపోవడం వల్ల ఈ భారీ ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది.
పరిశ్రమల్లో కనీస రక్షణ కవచాలు లేకపోవడం వల్లే పేద కార్మికులు బలి అవుతున్నారని అక్కడి కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గనుల యజమాన్యాల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విష వాయువుల ప్రభావం తగ్గే వరకు గని పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. తదుపరి వివరాల కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్లో తాలిబన్ల కొత్త చట్టం!