Huzurabad Hospital: హుజురాబాద్, స్వేచ్ఛ : హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోని లిఫ్టు చెడిపోయి నిరుపయోగంగా ఉన్నా, సంబంధిత అధికారులు కనీసం మరమ్మతులు చేయించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లిఫ్టు పనిచేయకపోవడంతో ఆపరేషన్ అయిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో అంతస్తు నుంచి మెట్ల ద్వారా కిందకు దిగాలంటే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్ట్రెచర్ల మీద మోసుకెళ్లడం అటెండర్లకు భారంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజల పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధి వేల్పుల ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న సమస్య తలెత్తినా ఐదు నిమిషాల్లో పరిష్కరించే మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ, వందలాది మంది వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద సమస్య ఉన్నా సూపర్నెంట్ గారు స్పందించకపోవడం దారుణం. పేషెంట్ల ట్రీట్మెంట్ విషయంలో మరియు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించడం తగదు” అని మండిపడ్డారు.
తక్షణమే ఆసుపత్రి అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన లిఫ్టుకు మరమ్మతులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా నిర్లక్ష్యాన్ని వీడి, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.