Pakistan blast: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో ఏడుగురు మరణించగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్కీ మార్వత్ జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే నౌరంగ్ బజార్ సమీపంలోని ‘ఫట్టక్ చౌక్’వద్ద ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు ఒక ఆటో రిక్షాలో అమర్చిన శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని (IED) లక్ష్యంగా చేసుకుని పేల్చివేయడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.
మరణించిన వారిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు ఉండగా.. మిగిలిన వారు సాధారణ పౌరులు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు , పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పేలుడు ధాటికి అక్కడి వాహనాలు ధ్వంసమవడమే కాకుండా స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తుందనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: కేరళలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు స్కూల్ బస్సుల దగ్ధం