Plane Incident: నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి భద్రాపూర్కు బయలుదేరిన బుద్ధ ఎయిర్కు చెందిన ATR-72 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం రన్వేపై దిగుతున్న క్రమంలో అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిపోయింది.
రన్వే ముగిసిన తర్వాత కూడా సుమారు 200 మీటర్ల దూరం ముందుకు వెళ్లడంతో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 51 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం బోల్తా పడకుండా ఆగిపోయింది, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అత్యవసర సేవా బృందాలు రంగంలోకి దిగాయి. విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.
అయితే విమానం రన్వే దాటి గడ్డి ప్రాంతంలోకి దూసుకెళ్లడం వల్ల ల్యాండింగ్ గేర్, విమానం కింది భాగానికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా భద్రాపూర్ విమానాశ్రయంలో ఇతర విమానాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది.
మొత్తానికి విమానం అదుపు తప్పడానికి గల కారణాలపై నేపాల్ పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపమా లేక ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించలేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో 11 మంది!
సాధారణంగా ATR-72 వంటి విమానాలు అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు, అయితే నేపాల్లోని భౌగోళిక పరిస్థితులు, చిన్న రన్వేల కారణంగా అక్కడ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆ విమానాన్ని రన్వే పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రన్వేపై నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం
నేపాల్-భద్రాపూర్లో ల్యాండింగ్ సమయంలో రన్వేపై నుంచి పక్కకు దూసుకెళ్లిన బుద్ధ ఎయిర్కు చెందిన ATR-72 విమానం
ఖాట్మండు నుంచి వచ్చిన ఈ విమానంలో 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం
రన్వే దాటి 200 మీటర్ల దూరం ముందుకు… pic.twitter.com/XhpwxrISHm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2026