Iran Israel War: ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సేనలు.. గత శనివారం దాడిని మరింత తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ చేసిన ఓ పని.. అగ్రరాజ్యానికి తీవ్ర కోపం తెచ్చినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని 30 చమురు నిల్వ కేంద్రాలపై (Fuel Depots) ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడులు అమెరికాను విస్మయానికి గురిచేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనైనట్లు శ్వేతసౌధం అధికారులు తెలియజేశారు.
ఇజ్రాయెల్ దాడుల స్థాయిని చూసి అమెరికా అధికారులు ఆశ్చర్యపోయినట్లు ఆక్సియోస్ (Axios) నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్ ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ దాడులు ఇంత భారీ స్థాయిలో ఉంటాయని అమెరికా ఊహించలేదని తెలిపింది. ఒక సీనియర్ అమెరికా అధికారి ఇజ్రాయెల్ వైఖరిపై ‘WTF’ (తీవ్ర అసహనం) అంటూ స్పందించినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల పట్ల సంతోషంగా లేరని ఆయన సలహాదారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైఖరి ఆయనకు బాగా కోపం తెప్పించిందని అన్నారు. ‘అధ్యక్షుడికి ఈ దాడి నచ్చలేదు. ఆయన చమురును కాపాడాలని అనుకుంటున్నారు. తగులబెట్టాలని కాదు. ఇలాంటి దాడులు పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమవుతాయి’ అని ట్రంప్ సలహాదారుడు ఒకరు చెప్పుకొచ్చారు.
చమురు నిల్వలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల సామాన్య ఇరాన్ ప్రజలు ఇబ్బంది పడతారని శ్వేద సౌధం అధికారి అభిప్రాయపడ్డారు. ఇది వ్యూహాత్మకంగా ‘మంచి ఆలోచన కాదు’ (Not a good idea) కాదని పేర్కొన్నారు. దీనివల్ల ఇరాన్ ప్రజలు తమపై కోపం తెచ్చుకునే ప్రమాదం ఉందని శ్వేతసౌధం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రజలు.. అమెరికాకు మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే.
శనివారం (మార్చి 7) జరిగిన ఈ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశం నల్లటి పొగతో నిండిపోయింది. ఇజ్రాయెల్ దాడుల్లో షహ్రాన్ (Shahran), షహర్ రే (Shahr Rey) వంటి ప్రాంతాల్లోని చమురు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ఇరాన్ సైనిక అవసరాల కోసం ఈ చమురును ఉపయోగిస్తోందని ఆరోపించింది. అందుకే ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. అయితే ఆ దేశంలో చమురు కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదముందని ఆమెరికా ఆందోళన చెందుతోంది. యుద్ధం మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్ ధరలు 16-22 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి తర్వాత మరింత పెరిగితే వాటిపై వచ్చే విమర్శలను ఇజ్రాయెల్ తో పాటు తాము ఎదుర్కొవాల్సి వస్తుందని అమెరికా భావిస్తోంది.
తమ దేశంలోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మొజ్తబా ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా పరిగణించింది. తమ చమురు కేంద్రాలపై దాడులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్ కు 200 డాలర్లు చేరుకునేలా ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.