Trump Tariffs India| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య సంబంధాలపై మరోసారి హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ (చమురు) కొనుగోళ్లు కొనసాగిస్తే అమెరికా భారత్ దిగుమతులపై టారిఫ్లు పెంచుతుందని ఆయన అన్నారు. ఈ తాజా వార్నింగ్ రష్యన్ ఆయిల్ వ్యాపారంపైనే కేంద్రీకృతమైంది. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యన్ ఆయిల్ సమస్యపై భారత్ సహకరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
ఒక వైపు సుంకాలు పెంచుతామని వార్నింగ్ ఇస్తూనే మరోవైపు ట్రంప్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. మోదీని “మంచి వ్యక్తి” అంటూ పొగిడారు. మోదీకి తాను అసంతృప్తిగా ఉన్న విషయం తెలుసని, భారత్ తనను సంతోష పెట్టాలని కోరుకుంటుందని ట్రంప్ అన్నారు. టారిఫ్లు చాలా త్వరగా పెంచవచ్చని, అమెరికాకు బలమైన వాణిజ్య లివరేజ్ ఉందని చెప్పారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయడాన్ని అమెరికా చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో రష్యా.. ఉక్రెయిన్ యుద్ధానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటుందని అమెరికా వాదన. అంతేకాదు రష్యా చమురును కొనుగోలు చేసే ఇండియా ఆ చమురును ఇతర దేశాలకు విక్రయించి లాభాలు ఆర్జిస్తుందని అమెరికా తీవ్రంగా ఆరోపిస్తోంది. గతంలోనూ ఈ కారణం చూపిస్తూ టారిఫ్లు పెంచారు. 2025 ఆగస్టులో భారత్ వస్తువులపై అమెరికా టారిఫ్లు రెట్టింపు చేసి 50 శాతానికి పెంచింది.
మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇండియా తమతో సహకరించకపోతే టారిఫ్లు మరింత పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఈ సహకారం.. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు మాత్రమే సంబంధించింది. రష్యాను అడ్డుకునేందుకు భారత్ పై విదేశీ విధానాలతో వాణిజ్య ఒత్తిడి చేయాలనేది ఆయన ఉద్దేశం.
వెనిజులాపై తాజాగా అమెరికా చేసిన సైనిక దాడులు, వెనిజులూ ప్రెసిడెంట్ నికోలస్ మాదురో అరెస్ట్ తర్వాత అక్కడ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడుల గురించి మాట్లాడారు. గ్లోబల్ ఆయిల్ పాలిటిక్స్ను అమెరికా వాణిజ్య నిర్ణయాలతో కలిపారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ భారత్ చమురు కొనుగోళ్ల గురించి ప్రస్తావించారు.
అమెరికా, ఇండియా మధ్య గత కొంత కాలంగా సుంకాలు, వాణిజ్య విధానాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ హెచ్చరించడంతో ఈ చర్చలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రెండు దేశాల డిప్లొమాట్లు సంప్రదింపులు జరుపుతున్నారు.
రష్యా ఆయిల్ పై మోదీ హామీ నిజమా?
గతంలో మోదీ.. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేస్తామని హామీ ఇచ్చినట్లు ట్రంప్ అక్టోబర్లో చెప్పారు. కానీ భారత్ అధికారులు అలాంటిదేమీ జరగలేదని ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు.
మార్కెట్ అందుబాటు, కన్స్యూమర్ అవసరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. రాజకీయ కారణాలు లేవని, స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తామని స్పష్టం చేసింది.
Also Read: ఇంటర్నెట్లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
అమెరికా ఆంక్షల తర్వాత కూడా రష్యా చమురు తన చమురు వ్యాపారాన్ని ఏ ఆటంకం లేకుండా కొనసాగిస్తోంది. నిజానికి ఇంకా పెంచింది. ఇప్పటికీ భారత్ చమురు కొనుగోళ్లలో అత్యధిక వాటా రష్యాదే. ట్రంప్ టారిఫ్లతో రష్యాపై ఒత్తిడి పెంచి, పుతిన్ను ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా చేయాలని భావిస్తున్నారు. కానీ భారత్ విదేశీ ఒత్తిడిని జాగ్రత్తగా ఉంటోంది.
ట్రంప్ మళ్లీ టారిఫ్ హెచ్చరిక చేయడంతో వాణిజ్యం, భౌగోళిక రాజకీయాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. భవిష్యత్ చర్చలు ఇప్పుడు భారత్కు కీలకంగా మారాయి.