Pulse Crops: స్వేచ్ఛ బ్యూరో: ధాన్యానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది. కానీ ఆ పంటలకు తగిన మార్కెటింగ్ వసతులు, మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం చూపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు పిలుపు మేరకు ఈసారి రైతాంగం పెద్ద ఎత్తున పప్పు ధాన్యాల (కందులు, మినుములు, పెసర్లు) వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ సీజన్లో గతేడాదితో పోలిస్తే ఏకంగా 2,19,216 ఎకరాల్లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరిగిన సంతోషం ఒకవైపు ఉన్నా.. తీరా పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు చేస్తారో లేదోనన్న ఆందోళన రైతన్నలను తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర కొనుగోలు కేంద్రాలపై సర్కార్ నోరు మెదపకపోవడంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం, మరోవైపు ప్రభుత్వం వరిసాగు చేయవద్దని విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపింది. గతేడాది పప్పుధాన్యాల సాగు 5,60,424 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈసారి ఇప్పటివరకు 7,79,640 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు ప్రభుత్వ వైబ్ సైట్లోనే అధికారికంగా పేర్కొన్నారు. అంటే 2,19,216 ఎకరాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కందులు 78,451 ఎకరాలు, పెసర 94897, మినపప్పు42,545, ఇతర పప్పు ధాన్యాలు 3504 ఏకరాల్లో సాగైంది. దీనికి తోడు సోయాబీన్ 12,015 ఎకరాలు పెరుగగా, వేరుశనగా 6789 ఎకరాలు పెరిగింది.
ప్రత్యామ్నాయ పంటల కొనుగోలుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. కనీస మద్దతు ధర గ్యారెంటీ ఉందా? ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా మార్కెఫెడ్, ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరుస్తారా? అనే అంశాలపై క్లారిటీని ప్రభుత్వం ప్రకటించ లేదు. యాసంగిలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేశారు. అయితే ఈసారి వరివద్దని ప్రత్యామ్నాయపంటలు సాగు చేయాలని ప్రభుత్వ సూచనమేరకు చేసిన రైతాంగానికి పప్పు ధాన్యాల కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళన చెంతున్నారు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో రైతులకు సమాధానం చెప్పలేక వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు తలలు పట్టుకుంటున్న ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ విభాగాలు, ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారులు సైతం ‘మాకూ ఏమీ తెలియదు’ అని చేతులెత్తేస్తున్నారు.
Also read: నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే
ప్రభుత్వ ప్రోత్సాహంతో పంట మార్పిడి చేసి ప్రత్యామ్నాయ పంటలు వేయడం, తీరా దిగుబడి వచ్చాక మద్దతు ధర దక్కక దళారులకు తక్కువ రేటుకే అమ్ముకొని నష్టపోవడం ప్రతి ఏటా పరిపాటిగా మారింది.మార్కెట్ సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై మద్దతు ధర కంటే 20% నుండి 30% తక్కువ ధరకే పంటను తెగనమ్ముకునేలా రైతులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. గ్రామాల్లో తగినన్ని గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ వసతులు లేకపోవడం రైతుల బలహీనతగా మారి దళారులకు వరంగా మారుతోంది.మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి. కంది, వేరుశనగా కొనుగోలు కోసం రైతులు పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి.దీనికితోడు గ్రామాల్లో తగినన్ని కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు లేకపోవడంతో పంటను నిల్వ చేసుకునే అవకాశం కూడా రైతులకు లేకుండా పోతోంది. కేవలం వరిధాన్యం నిల్వలకే గోదాములు సరిపోవడం లేదు. అయితే ఈసారి పప్పుధాన్యాలను ఎలా కొనుగోలు చేస్తారు? ఎక్కడ నిల్వ చేస్తారనేది కూడా చర్చమొదలైంది.
కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి, ప్రభుత్వం చెప్పిన ప్రత్యామ్నాయ బాటలో నడిచిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంది. ఈ సీజన్లోనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించిపప్పు ధాన్యాల కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. అంతేగాకుండా మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేసేలా మార్కెఫెడ్కు నిధులు కేటాయించాలని,క్షేత్రస్థాయి అధికారులకు వెంటనే స్పష్టమైన కొనుగోలు మార్గదర్శకాలు జారీ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రత్యామ్నాయం సరే.. మరి మార్కెట్ సంగతేంటి?’ అని ప్రశ్నిస్తున్న రైతాంగానికి ప్రభుత్వం ఈసారైనా స్పష్టమైన హామీ ఇస్తుందో లేక ఎప్పటిలాగే దళారుల చేతిలో బలిచేస్తుందో వేచి చూడాలి!
Also Read: ఎక్స్ ప్రెస్ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?