UAE: పశ్చిమాసియా యుద్ధాన్ని తప్పుదారి పట్టించేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారు కొందరు వ్యక్తులు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చేశారు. ఏకంగా 35 మంది బుక్కయ్యారు. 19 మంది భారతీయులు ఉన్నారు. వారిని యూఏఈ అధికారులు అరెస్టు చేశారు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
ఇరాన్ యుద్ధం.. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యూఏఈ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం 35 మందిని అరెస్ట్ చేసింది. అందులో 19 మంది భారతీయులు కూడా ఉన్నారు.
వీరిని వేగంగా విచారించేందుకు న్యాయస్థానం.. అధికారులను ఆదేశించింది. యుద్ధం నేపథ్యంలో ప్రజలను భయాందోళనలకు గురి చేసి దేశంలో అస్థిరత సృష్టించేలా రకరకాలుగా తప్పుడు పోస్టులు పెట్టినట్టు వీరిపై అభియోగాలు నమోదయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించిన నకిలీ వీడియోలు, క్షిపణి దాడుల వీడియోలకు సంబంధించి భయానక వ్యాఖ్యానాలు జోడించి సర్క్యులేట్ చేశారు.
35 మందిని అరెస్ట్ చేసిన యూఏఈ, 19 మంది భారతీయులు కూడా
ఈ విషయాన్ని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ తెలిపారు. మార్చి సెకండ్ వీక్ నుంచి రెండు విడతలుగా నిందితులను అరెస్టు చేశారు. నిందితులు మూడు బృందాలుగా విడిపోయి ఈ చర్యలకు పాల్పడినట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. శత్రు దేశ సైనిక చర్యలను కీర్తిస్తూ పోస్టులు చేయడం ఒకటైతే, పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా పోస్టు చేశారు.
నేరం నిరూపణ అయితే యూఏఈ సైబర్క్రైమ్ చట్టం ప్రకారం తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు కనీసం ఏడాది జైలు శిక్ష పడనుంది. అంతేకాదు లక్ష దిర్హమ్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 22 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష, జరిమానా రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి.
ALSO READ: షాకింగ్.. భర్తను ప్రేయసికి లీజుకు ఇచ్చిన భార్య.. నెలకు రేటు ఎంతో తెలుసా?
గతనెల చివరివారంలో అబుదాబిలోని భారత ఎంబసీ ఇప్పటికే తమ పౌరులు వదంతులు వ్యాప్తి చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కానీ 19 మంది అవేమీ పట్టించుకోలేదు. ఫలితంగా అడ్డంగా బుక్కయ్యారు. ఈ జాబితాలో భారతీయులతోపాటు వివిధ దేశాలకు చెందిన 25 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో పాకిస్తాన్, నేపాలీ ఫిలిప్పీన్స్, ఈజిప్టు దేశాలకు చెందినవారు ఉన్నారు.