Narayanpet Elections: మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నదొక్కటి జరిగిందొకటి అన్నట్టు తయారైందట నారాయణపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పరిస్థితి. ఫలితాలు తారుమారు కావడంతో ఆ మాజీ ఎమ్మెల్యే షాక్ అయ్యాడట. ప్రచారంలో కాళ్లు అరిగేలా తిరిగితే 24 డివిజన్లలో గెలిచింది కేవలం రెండంటే రెండేనట. ఆ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైందట. అక్కడి మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడంతో రాజేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారట. ఇంతకూ నారాయణపేటలో రాజేందర్రెడ్డికి అలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది?
మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట మున్సిపాలిటీ పొలిటికల్ హీట్ తారాస్థాయిలో నడిచింది. ఏకంగా మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ బరిలో దిగి తలపడ్డాయి. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, కీలక నేత శివకుమార్ రెడ్డి మంత్రాంగం నడిపితే… బీజేపీ తరపున ఎంపీ డీకే అరుణ, స్థానిక నాయకుల చక్రం తిప్పారు. బీఆర్ఎస్ తరపున నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి ప్రచారం దగ్గర నుంచి అన్ని బాధ్యతలు తానే స్వయంగా చూసుకున్నారు.
నారాయణపేట జిల్లాలో మూడు ప్రధాన పార్టీలు జిల్లా కేంద్రం మున్సిపల్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటా పోటీ వ్యూహాలతో తలపడ్డాయి. ఎవరికి వారు మెజారిటీ వార్డులను కైవసం చేసుకునేందుకు పోలింగ్ రోజు వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు మూడు పార్టీలను షాక్ కు గురిచేశాయి. ఎవరికి చైర్పర్సన్ సీటు దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్క లేదు. దీంతో మున్సిపాలిటీలో హంగ్ ఏర్పాడిల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇక పార్టీల వారీగా మునిసిపల్ లెక్కలు చూస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. 24 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి ఆశలు పెట్టుకున్నా, పట్టణ ఓటర్లు మాత్రం కరుణించలేదు. రాజేందర్రెడ్డి నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి పోలింగ్ ముందు వరకు పట్టణంలో గడపగడపకు తిరిగినా, ఎన్నికల ఫలితాలు మాత్రం పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి.
ఇక ఓటరు తీర్పు, వచ్చిన సీట్ల తో పాటు మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటున్నారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించడం… ఆ తర్వాత ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో మున్సిపాలిటీలో బీజేపీ సొంతగా పాగా వేయడం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోందంట. రానున్న రోజుల్లో బీజేపీ బల పడితే కాంగ్రెస్ కంటే గులాబీ పార్టీకేఎక్కువ నష్టం జరగనుందన్న టాక్ నారాయణపేట పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది…
మొత్తంగా 10 సంవత్సరాలు నారాయణపేటలో ఏకచత్రాధిపత్యంగా ఏలిన మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయట. ప్రతిపక్షంలో ఉంటూ ఆది కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉండి, జిల్లా కేంద్రంలో ఇలాంటి ఫలితాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆ క్రమంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఎమ్మెల్యే తో పాటుపార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైందట.
Also Read: ధర్మాన మౌనం.. తమ్మినేని దూరం.. శ్రీకాకుళం వైసీపీలో ఏం జరుగుతోంది?
Story by: Apparao, Big Tv