Chinmoy Krishna Das: బంగ్లాదేశ్ లో హిందువుల నాయకుడైన చిన్మయ్ కృష్ణ దాస్.. తల్లి అంత్యక్రియల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కృష్ణ దాస్.. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 5 గంటల పాటు పెరోల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయానికి వెళ్లి దేవతామూర్తుల విగ్రహం పాదాలు పట్టుకొని ఆయన విలపించిన తీరు.. స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మరోవైపు బతికుండగానే కొడుకును చూసుకోవాలని ఎంతగానో పరితపించిన ఆ తల్లి.. చివరి కోరిక తీరకుండానే మరణించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోత్ అధికార ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ తల్లి సంధ్యా రాణి ధార్ (71) హత్హాజారిలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. తల్లి మరణానంతరం చిట్టగాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ జైదుల్ ఇస్లాం మీయా.. దాస్కు ఐదు గంటల తాత్కాలిక పెరోల్ మంజూరు చేశారు. పెరోల్ సమయంలో పుండరీక్ ధామ్ ఆలయానికి వచ్చిన ఆయన అక్కడి రాధా-కృష్ణుల విగ్రహం పాదాలను తాకి తీవ్రంగా రోదించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అనంతరం పుండరీక్ ధామ్లోనే ఆయన తన తల్లి అంతిమ సంస్కారాలను సోదరుల సహాయంతో పూర్తి చేసి తిరిగి జైలుకు వెళ్లారు.
Sri Chinmay Krishna Das Prabhu touched the feet of Radha-Krishna in Pundarik Dham temple of #Chattragram before taken to jail.
Sri Chinmay Krishna Das Prabhu was given only a few hours of parole to see his dead mother for the last time. pic.twitter.com/JcLKT8OF3F
— Hindu Voice (@HinduVoice_in) September 10, 2026
కుమారుడు సుదీర్ఘకాలంగా జైలులోనే ఉండటం, ఆయన ఆరోగ్యం క్షీణించడం, వరుసగా బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో సంధ్యా రాణి తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె చివరి రోజుల్లో కుమారుడిని చూడాలని బలంగా కోరుకుందని పేర్కొన్నారు. దీంతో సంబంధించి అధికారులను ఈ విషయమై ఆశ్రయించగా.. అనారోగ్యంతో ఉన్న బంధువులను చూడటానికి ఖైదీలకు పెరోల్ ఇచ్చే నిబంధన బంగ్లాదేశ్ చట్టాల్లో లేదని వారు తేల్చి చెప్పినట్లు తెలిపారు. ఫలితంగా బతికుండగా కొడుకును చూడాలన్న ఆమె ఆశ అడియాసగానే మిగిలిపోయిందని వాపోయారు.
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీల హక్కులు, రక్షణ కోసం చిన్మయ్ కృష్ణ దాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. అదే ఏడాది నవంబర్లో జాతీయ పతాకాన్ని అవమానించారనే దేశద్రోహం ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పూర్వపు ఇస్కాన్ (ISKCON) ప్రతినిధి అయిన ఆయనపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల హైకోర్టు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ దేశద్రోహం కేసులో బెయిల్పై స్టే ఉండటం, మరికొన్ని కేసులు పెండింగ్లో ఉండటంతో ఆయన జైలులోనే కొనసాగాల్సి వస్తోంది.
Also Read: రూ. 2,000 కే వాషింగ్ మిషన్.. సైకిల్ పెడల్ తొక్కితే బట్టలు క్లీన్.. ఇదేదో భలే ఉందే!
మరోవైపు దాస్ అరెస్ట్ను నిరసిస్తూ చిట్టగాంగ్లో మద్దతుదారులు చేపట్టిన నిరసనల్లో తీవ్ర హింస చెలరేగింది. ఆ సమయంలో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం అలీఫ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు విచారణ ప్రస్తుతం చిట్టగాంగ్ స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్లో కొనసాగుతోంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు బెయిల్ లభించి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read: జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!