BRICS Summit: భారత్ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. భిన్నాభిప్రాయాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. అంతటా ఉత్కంఠ రేపిన ఢిల్లీ డిక్లరేషన్కు సభ్య దేశాలన్నీ ఆమోదం తెలిపినట్లు ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధంతో.. ఇరాన్, యూఏఈ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. అయితే, భారత్ ప్రదర్శించిన అసాధారణ దౌత్య నైపుణ్యం.. ఈ రెండు దేశాలతో పాటు సభ్య దేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. సుదీర్ఘ చర్చల తర్వాత.. ఏ దేశం పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించకుండా, ఏకపక్ష యుద్ధాలు, దాడులను ఖండిస్తూ ఉమ్మడి ప్రకటనను వెలువరించాయి.
పెరుగుతున్న సంఘర్షణలపై మోడీ ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలపై పీఎం మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ, సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ రంగాల్లో సభ్య దేశాలు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్ ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
బ్రిక్స్ దేశాలు ఉందోళన..
పశ్చిమాసియా యుద్ధం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్నారు. ఇక.. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా.. అమెరికా లాంటి దేశాలు విధిస్తున్న ఏకపక్ష సుంకాలు, నిర్బంధ చర్యలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అదేవిధంగా.. ఏ రూపంలోనూ ఉగ్రవాదాన్ని సహించేది లేదని బ్రిక్స్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడిని సభ్య దేశాలు ఖండించాయి. అంతర్జాతీయ వివాదాలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని బ్రిక్స్ పిలుపునిచ్చింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లు, భిన్నాభిప్రాయాల వేళ.. ఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా.. బ్రిక్స్ కూటమి మరోసారి తన ఐక్యతను నిరూపించుకుంది. ఈ సదస్సుతో.. గ్లోబల్ సౌత్ గొంతుని ప్రపంచానికి వినిపించడంలో భారత్ కీలక మైల్స్టోన్ అందుకుంది.
Also Read: వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!