Iran Conflict: ఇరాన్లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయా? శాంతి చర్చల పేరిట ఇరు దేశాల మధ్య దాడులు జరుగుతున్నారా? ముఖ్యంగా ఇరాన్లోని పాలకుల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అమెరికా చేస్తోందా? తాజాగా ఇరాన్కు చెందిన రాడార్, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై దాడులు చేసిందా? ప్రత్యర్థిని కోలుకోని దెబ్బ తీసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రూటు మార్చిన అమెరికా.. ఇరాన్పై మెరుపు దాడులు
మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ పొడిగింపు కోసం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు జఠిలమవుతున్నాయి. తాజాగా ఇరాన్లోని రాడార్, డ్రోన్ల కమాండ్ సెంటర్పై అమెరికా బలగాలు దాడులకు దిగాయి. ఈ మేరకు అమెరికా సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆత్మ రక్షణ కోసం దాడులు చేశామని తెలిపింది. ఇరాన్ కూడా అదే స్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికీ ప్రతీకార చర్యలేనని తెలిపింది.
అంతర్జాతీయ జలాల్లో తాము నిఘా పెట్టిన ఎమ్క్యూ-1 డ్రోన్ను కూల్చి వేసిందని అమెరికా ప్రధాన ఆరోపణ. అందుకు ప్రతిగానే అమెరికా జెట్ లు.. దక్షిణ ఇరాన్లో క్విష్మ్ ద్వీపంలోని రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కంట్రోల్ కేంద్రాలపై దాడులు చేసినట్టు తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన రెండు సూసైడ్ డ్రోన్లు ధ్వంసం చేశామని వెల్లడించింది. అయితే తమ సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటన చేసింది.
సౌత్ ఇరాన్లోని రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్
దీనిపై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. సరిక్ ద్వీపంలోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసినట్టు కువైట్ సైన్యం వెల్లడించింది.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లపై పడుతోంది. ఈ క్రమంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు అమాంతంగా 2 శాతం పెరిగింది. ప్రస్తుతం 93.05 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. మరోవైపు దాడుల్లో ధ్వంసమైన భూగర్భ క్షిపణి టన్నెళ్లను ఇరాన్ వేగంగా పునరుద్ధరిస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ALSO READ: హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?
శాటిలైట్ చిత్రాల ఆధారంగా దెబ్బతిన్న 69 టన్నెల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు రాసుకొచ్చాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా ఉండకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.