Bachupally Fire Accident: హైదరాబాద్ నగరం బాచుపల్లి ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. మంటల్లో కాలి బూడిదైన ఫర్నీచర్ దుకాణాలను స్వయంగా చూసిన ఆయన.. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే నిప్పు రవ్వలు ఎగిసిపడి దుకాణాలకు అంటుకున్నాయని నిర్వాహకులు కమిషనర్కు వివరించారు. మరికొందరు దుకాణదారులు పైన వెళ్తున్న విద్యుత్ తీగ తెగి పడటం వల్ల ఈ ఘోరం జరిగిందని తెలిపారు. వేసవి కాలం మొదలైనందున చిన్న నిప్పు రవ్వ కూడా పెను ముప్పుగా మారుతుందని, అగ్నిప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా రంగనాథ్ సూచించారు.
అగ్నిప్రమాదాల నివారణ అనేది కేవలం అధికారుల తనిఖీల వల్ల మాత్రమే సాధ్యం కాదని.. ప్రతి ఒక్కరూ సొంతంగా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించినప్పుడే ఆస్తి.. ప్రాణ నష్టాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఒక్క ప్రమాదంతో బూడిద కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాచుపల్లి ఘటనలో ఒక్కో దుకాణంలో దాదాపు రూ. 25 లక్షలకు పైగా విలువైన ఫర్నీచర్ ఉందని.. మొత్తం 22 దుకాణాలు కాలిపోవడం వల్ల తీరని నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. బాధిత వ్యాపారులకు నష్టపరిహారం అందించే విషయాన్ని రెవెన్యూ విభాగం చూస్తుందని కమిషనర్ తెలిపారు.
భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా హైడ్రాకు కట్టబెట్టాలని ప్రభుత్వానికి నివేదించినట్లు రంగనాథ్ వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో కొన్ని గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయని.. జనసాంద్రత ఉన్న చోట ఇటువంటి అజాగ్రత్తలు ఉండకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా వాణిజ్య సముదాయాలు.. గోదాముల్లో విద్యుత్ వైరింగ్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలని సూచించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించేలా ఫైర్ ఎక్స్టింగ్యుషర్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం పెరిగి ట్రాన్స్ఫార్మర్లు.. ఎలక్ట్రికల్ ప్యానెళ్లపై భారం పడుతుంటుంది. ఇది షార్ట్ సర్క్యూట్లకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారులు.. నివాసితులు తమ పరిసరాల్లో ఉన్న విద్యుత్ వ్యవస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైడ్రా కమిషనర్ కోరారు. అగ్నిమాపక నిబంధనలను ఉల్లంఘించే భవనాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను.. ఆస్తులను రక్షించడమే హైడ్రా ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: లైక్స్ పిచ్చి ఎటు తీసుకెళ్తోంది?: సోషల్ మీడియా స్టంట్లపై సీపీ సజ్జనార్ ఆగ్రహం