CBSE Class 12 re-evaluation Result: సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ దాదాపుగా పూర్తి అయ్యింది. విద్యార్థుల మార్కుల వెరిఫికేషన్ ఫలితాలను దశలవారీగా విడుదల చేస్తోంది. ఆదివారం అనగా జూన్ 21 నాటికి దాదాపు 87 శాతం పూర్తి చేసినట్టు బోర్డు వెల్లడించారు. విద్యార్థులు రీ-ఎవాల్యుయేషన్ ఫలితాలను డిజిలాకర్లో చెక్ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ఫలితాలు
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్-OSM విధానంపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు తీవ్రమయ్యాయి. ఆపై ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా చల్లటి కబురు చెప్పింది సీబీఎస్ఈ బోర్డు. మార్కుల వెరిఫికేషన్ సమాధాన పత్రాల రీ-ఎవాల్యుయేషన్ కోసం సుమారు 1.68 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.
విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులలో అధిక భాగం పరిష్కరించామని తెలిపింది. మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేస్తామని సీబీఎస్ఈ బోర్డు ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు తమ అప్డేట్ ఫలితాలను results.digilocker.gov.in లో పరిశీలించుకోవాలని సూచన చేసింది. విద్యార్థులు తమ రోల్ నెంబర్, ఇతర వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. దాని ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
87 శాతం పూర్తి.. ఫలితాలను డిజిలాకర్లో చెక్ చేసుకోవచ్చు
ఇక పోర్టల్లో మార్పులు జరిగాయి, మార్పు లేదు, ప్రక్రియలో ఉంది అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఫలితాల్లో మార్పు లేని విద్యార్థులు సమాధాన పత్రాలను పరిశీలించుకునే అవకాశం ఉంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో నిర్ధారించేందుకు ఫలితాలను దశలవారీగా విడుదల చేస్తున్నామని వెల్లడించింది బోర్డు.
పునఃమూల్యాంకన ఫలితాలకు సంబంధించి ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది. ఏమైనా అప్డేట్స్, నోటిఫికేషన్లు అధికారిక సీబీఎస్ఈ సమాచార మార్గాల ద్వారా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
ALSO READ: ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్