Fake NOCs: అధికార వర్గాల్లో కలకలం సృష్టించిన నకిలీ ఎన్వోసీల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటివరకు 56 కాలేజీలు నకిలీ ఎన్వోసీలు సృష్టించినట్టు నిర్ధారించుకున్న హైడ్రా మరో 176 కాలేజీలపై విచారణ చేస్తోంది. అదే సమయంలో ఈ నకిలీ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. కాలేజీలు నడిపించాలంటే వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఫైర్ ఎన్వోసీ సర్టిఫికెట్లను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కాలేజీలు నడిపించటానికి ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి ఇవ్వరు.
నాన్ హైరైజ్ భవనాలకు ఎన్వోసీ ఇచ్చే అధికారం హైడ్రాకు ఉంది. ఇదే అవకాశంగా కొన్ని కాలేజీల యాజమాన్యాలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించాయి. బర్కత్ పురాలోని హైందవీ జూనియర్ కాలేజీ కూడా ఇలాంటి ఎన్వోసీనే ఇచ్చింది. దీనిపై ఫిర్యాదు రాగా హైడ్రా అధికారులు ఆయా కాలేజీలు సమర్పించిన ఎన్వోసీలను తెప్పించుకుని పరిశీలించగా మొదట 8కాలేజీలు నకిలీ ఎన్వోసీలు ఇచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. వీటిపై హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత హైడ్రా జరిపిన విచారణలో మరో 48 కాలేజీలు కూడా ఇలాగే నకిలీ ఎన్వోసీలు సమర్పించినట్టు తేలింది. దాంతో వాటి జాబితాను కూడా పోలీసులకు పంపించారు.
Also Read: రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్పై హోం మంత్రి అనిత ఫైర్!
కాగా, హైడ్రా తాజాగా మరో 176 కాలేజీలపై విచారణ జరుపుతోంది. ఐదు అంతస్తులలోపు ఉన్న భవనాల అనుమతుల కోసం ఫైర్ ఎన్ఓసీలను హైడ్రా ఇస్తుంది. ఆఫ్ లైన్లో ఎన్వోసీలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్టు విచారణలో వెల్లడైంది. ఎన్వోసీల కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్ మాజీ డీజీల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. హైడ్రా నివేదిక, పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలను ఆధారంగా చేసుకుని కాలేజీ యజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా, ఈ వ్యవహారంలో ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో కూడా హైడ్రా అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో హైడ్రాలో పని చేస్తున్నామంటూ కొందరు డబ్బు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాలేజీల యాజమాన్యాలకు ఉద్యోగులు ఎవరైనా సహకరించారా అన్న దిశగా ఆరా తీస్తున్నారు.
Also Read: తెలంగాణ ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి ఆ రూల్ బంద్!