Bosch AC: జర్మన్ దిగ్గజ సంస్థ బాష్ (Bosch).. భారత ఎయిర్ కండిషనర్ (AC) మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం Hitachi (హిటాచీ) బ్రాండ్తో కొనసాగుతున్న ఈ సంస్థ.. త్వరలో ‘డ్యూయల్ బ్రాండ్’ (Dual brand) వ్యూహాన్ని అనుసరించాలని యోచిస్తోంది. అదే జరిగితే ఒకే కంపెనీ రెండు డిఫరెంట్ పేర్లతో ఏసీలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సుధాకరన్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్లో Bosch బ్రాండ్ పేరుతో ఏసీలను విడుదల చేసే ఆలోచన పరిశీలనలో ఉంది. అదే జరిగితే ఆసియా మార్కెట్లోనే Bosch బ్రాండ్ ఏసీలు రావడం ఇదే తొలిసారి కానుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ ఏసీలు యూరోప్, ఇతర పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం.
అయితే Bosch సొంతంగా ఏసీలను తెచ్చినప్పటికీ.. హిటాచీ (Hitachi) బ్రాండ్ యథావిధిగా భారత్లో కొనసాగుతుందని తెలుస్తోంది. గతంలో చేసుకున్న దీర్ఘకాలిక లైసెన్స్ ఒప్పందం కారణంగా హిటాచీ బ్రాండ్ ను సైతం కొనసాగించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని బట్టి చూస్తే భారత మార్కెట్ లో Bosch, Hitachi రెండు బ్రాండ్లూ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే బాష్ (Bosch) సంస్థ.. భారత్ లో తన హిటాచీ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 2026 సంవత్సరానికి గాను 80కి పైగా కొత్త హిటాచీ ఏసీ మోడళ్లను భారత్లో ఆవిష్కరించింది. ఇవి 54 డిగ్రీల తీవ్ర ఎండలోనూ సమర్థవంతంగా గదులను చల్లబరుస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 మోడల్ ఏసీల్లో AI కూలింగ్, ఆక్టా సెన్సార్ టెక్నాలజీ (Octa Sensor Technology), 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి అధునాతన ఫీచర్లను సైతం పొందుపరిచినట్లు తెలిపాయి. ప్రస్తుతం ఈ నయా మోడల్ హిటాచీ ఏసీలు.. యోషి (Yoshi), తౌషి (Toushi), ఐజెన్ (iZen) వంటి సిరీస్లలో లభిస్తున్నాయి.
Also Read: Smartphones 2026: మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!
ప్రస్తుతం భారత ఏసీ మార్కెట్లో హిటాచీకి సింగిల్ డిజిట్ వాటా మాత్రమే ఉంది. దీనిని రాబోయే రోజుల్లో డబుల్ డిజిట్ కు తీసుకెళ్లాలని మాతృసంస్థ బాష్ భావిస్తోంది. వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి అగ్రగామి సంస్థలకు పోటీనిస్తూ టాప్-3 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గత నాలుగేళ్లలో సుమారు రూ.500 కోట్లను పరిశోధన, అభివృద్ధి కోసం వెచ్చించడం గమనార్హం. భవిష్యత్తులో బాష్ బ్రాండ్ పేరుతో భారత్ లో అడుగుపెట్టడం ద్వారా ఏసీ మార్కెట్ లో వాటాను డబుల్ డిజిట్ కు పెంచుకోవాలని కంపెనీ యాజమాన్యం బావిస్తోంది.