Artificial intelligence: కృత్రిమ మేధస్సు అనేది మానవ మేధస్సుకు హాని. అది ఏదో ఒకరోజు మానవ జీవనాన్ని శాసిస్తుంది. ఇలాంటి విషయాలు మనం తరచుగా వింటూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల జరిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం మనిషి జీవనానికి, భవిష్యత్తుకు ఏఐ కొత్త దారి చూపిస్తుందని చెప్తున్నారు. ఇంతలోనే ఏఐపై జరుగుతున్న పరిశోధనలు ఆపాలని కొందరు ముందుకొచ్చారు.
రెండు నెలల క్రితం కొందరు టెక్ దిగ్గజాలు అన్ని కలిసి ఏఐ వల్ల, ఏఐ సామర్థ్యంతో తయారు చేసిన చాట్జీపీటీ వల్ల ఇతర టెక్ రంగాలకు నష్టం చేకూరుతుందుని, అందుకే దానిపై పరిశోధనలను ఆపేయాలని ఓపెన్ లెటర్ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది టెక్ దిగ్గజాలు ఈ ఓపెన్ లెటర్పై సంతకం కూడా చేశారు. ఒకవేళ ఏఐపై పరిశోధనలను సంస్థలు ఆగకపోతే.. ప్రభుత్వాలే ముందుకు వచ్చి దీనిని ఆపాలని ఈ లెటర్లో పేర్కొన్నారు. కానీ లెటర్ పంపి రెండు నెలలు అయినా దీనిపై ఇంకా ఎలాంటి స్పందన లేదు.
ఆ లెటర్ గురించి తెలిసిన ఏఐ సంస్థలు కూడా అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కేవలం అందరి దృష్టిని తమవైపు తిప్పుకోవడం కోసం మాత్రమే కొందరు టెక్ దిగ్గజాలు ఈ లెటర్ ఐడియాతో ముందుకు వచ్చారని పలు విమర్శలపాలయ్యారు. వారు ఏ ఉద్దేశ్యంతో ఆ లెటర్ను రాసినా కూడా కొందరు ప్రజల్లో మాత్రం ఏఐ గురించి ఆలోచన మొదలయ్యింది. ఏఐ అనేది సేఫ్టీని అందించే విధంగా ఉంటుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి.
నిజానికి ఏఐ లాంటి సంచలనాత్మకమైన సృష్టిని ఆపడం కానీ, దానిపై పరిశోధనలను నిలిపివేయడం కానీ జరగని విషయమని చాలామందికి తెలుసు. అయినా కూడా దాని వల్ల వారి కంపెనీలకు నష్టం జరుగుతుంది అని ఒకేఒక్క ఉద్దేశ్యంతో టెక్ దిగ్గజాలు ఇలాంటి లెటర్ ఒకటి రాయాలి అనే నిర్ణయంతో ముందుకొచ్చారు. ఏఐ వల్ల జరిగే ప్రయోజనాల గురించి, నష్టాల గురించి చర్చించడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నా.. దానిపై పరిశోధనలను నిలిపివేయడానికి మాత్రం వారు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
ఏఐ గురించి ఎవరు ఎంత చెప్పినా.. దానిని నమ్ముతూ ముందుకెళ్లేవారు చాలామందే ఉన్నారు. ఏఐ వల్ల ప్రాణనష్టం జరుగుతుంది అనేది కేవలం సినిమాల్లో జరగడమే తప్ప.. నిజంగా అలాంటిది ఏమీ జరగదని ఏఐ సంస్థలు హామీ ఇస్తున్నాయి. ఇలాంటి ఒక సూపర్ ఇంటలిజెన్స్తో మానవాలి మొత్తం ఇబ్బంది పడే తప్పులు అనేవి ఎప్పటికీ జరగవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు ఏమి అనుకున్నా కూడా ఏఐపై పరిశోధనలు నిలిపివేయాలనే ఆలోచనలో మాత్రం తాము లేమని, అలాంటిది జరగదని ఏఐ సంస్థలు తేల్చాశాయి.