Ganja Youth Attack: విజయవాడలో గంజాయి ముఠాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా అజిత్ సింగ్ నగర్ నియోజకవర్గ పరిధిలో గంజాయి బ్యాచ్ సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
అజిత్ సింగ్ నగర్లోని ఒక నివాసంలోకి గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. ఇంట్లో ఉన్న మహిళా యజమానిని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, ఆమె కుమారుడిపై అత్యంత క్రూరంగా దాడికి తెగబడ్డారు. నిందితులు ముందుగా బాధితుడి కళ్లలో కారం చల్లి, ఆపై క్రికెట్ బ్యాట్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. “మిమ్మల్ని చంపేస్తాం” అంటూ కేకలు వేస్తూ ఇంటి కిటికీ అద్దాలు, తలుపులను ధ్వంసం చేసి అక్కడ భీభత్స వాతావరణాన్ని సృష్టించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. నగరంలో గంజాయి విక్రయాలు, వాడకం పెరిగిపోవడం వల్లే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.