Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్, భూ కుంభకోణాల వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చింది. శుక్రవారం శాసనసభ పక్ష (CLP) కార్యాలయంలో నిర్వహించిన చిట్చాట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కేటీఆర్ మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎద్దేవా చేస్తూనే, గత ప్రభుత్వ అక్రమాలను ఒక్కొక్కటిగా ఎండగట్టారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సీరియస్ నేరమని, కేటీఆర్ ముందుగా టెలిగ్రాఫ్ యాక్ట్ చదవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. “ఇద్దరు వ్యక్తుల సంభాషణను దొంగచాటుగా వినడం అనేది దౌర్భాగ్యం. వ్యాపారవేత్తలను లొంగదీసుకోవడానికి, వాటాల కోసం గత ప్రభుత్వం ట్యాపింగ్ను ఆయుధంగా వాడుకుంది” అని ఆరోపించారు. చివరికి సొంత మనుషులు హంపిలో దావత్ చేసుకున్నా, ట్యాపింగ్ ద్వారా సమాచారం సేకరించిన నీచ చరిత్ర బిఆర్ఎస్ది అని మండిపడ్డారు. తన క్లాస్ మేట్ శైలేందర్ రెడ్డి ఫోన్ సైతం ట్యాప్ చేశారని, ఆయన ఇప్పటికే సిట్ ముందు హాజరయ్యారని వెల్లడించారు.
బిఆర్ఎస్ నేతలను స్టువర్ట్ పురం దొంగలతో పోల్చిన ఆయన, కేసీఆర్ కుటుంబమంతా ‘అలీబాబా 420 దొంగల బ్యాచ్’ మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. క్విట్ ప్రోకో పద్ధతిలో వేల కోట్ల విలువైన భూములను దుర్వినియోగం చేశారని, ప్రజాక్షేత్రంలో ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. గత పదేళ్లలో సింగరేణిలో జరిగిన అవకతవకలపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)లో చర్చిస్తామని ప్రకటించారు.
చెల్లెలిగా కవితను గౌరవిస్తానని చెప్తూనే, కేసీఆర్ కుటుంబంలో గొడవలకు ఆస్తుల అంశమే మూలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “కవిత ఆత్మగౌరవ పోరాటం అంటుంది కానీ, అసలు సమస్య ఆస్తులదే. ఆమె కాంగ్రెస్లోకి వస్తానంటే ముందు నుంచి వద్దు అనే అంటున్నాను. మా పార్టీలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు, కవిత అవసరం మాకు లేదు” అని స్పష్టం చేశారు.
గత బిఆర్ఎస్ హయాంలోని సిట్ విచారణల (పేపర్ లీక్, డ్రగ్స్ కేసు) గతి ఏమైందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు కేటీఆర్ పర్యటనల కోసం కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవమని, పార్టీలో అలాంటి చర్చ లేదని కొట్టిపారేశారు.
పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో విచారణ కొనసాగుతోందని, అన్ని అంశాలను ఆరా తీసి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతోనే కేటీఆర్ ‘కార్తీక దీపం’ రాగాలు తీస్తున్నారని మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు.
Read Also: HYDRAA: కబ్జాదారుల గుండెల్లో హైడ్రా వణుకు.. కూకట్పల్లిలో 3300 గజాల పార్కు భూమి స్వాధీనం!