Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చేతిలో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఘెర పరాభవాన్ని చవిచూశారు. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈసారి పరాజయం పాలైనట్లు ఫలితాలు చెబుతున్నా.. మమతా బెనర్జీ మాత్రం ఈ ఓటమిని ససేమిరా అంగీకరించడం లేదు. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని.. బీజేపీ సాధించిన ఈ మెజార్టీ అంతా లూటీ అని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
“నేను ఓడిపోలేదు.. అందుకే రాజ్భవన్కు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించను.” అని మమత నేడు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సుమారు 100 సీట్లను బీజేపీ అక్రమంగా దొంగిలించిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం (EC), కేంద్ర ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా కుట్ర పన్ని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని మండిపడ్డారు. న్యాయవ్యవస్థ అందుబాటులో లేనప్పుడు.. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించినప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని.. దేశంలో ఒకే పార్టీ పాలన ఉండాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
సోమవారం నాడు పోలింగ్ కౌటింగ్ సమయంలో తనపై భౌతిక దాడి జరిగిందంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. “పోలింగ్ స్టేషన్లో నన్ను కడుపులో, వీపుపై తన్నారు. అక్కడ సీసీటీవీలు కూడా ఆఫ్ చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి నన్ను బయటకు నెట్టేశారు. ఒక మహిళ అని చూడకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించారు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు ఈ స్థాయిలో ప్రవర్తించడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు.
తమ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని వెల్లడించడానికి మమత నిరాకరించినప్పటికీ.. INDIA కూటమి నేతలు తనతో టచ్లో ఉన్నారని.. వారంతా తనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు ఐదుగురు ఎంపీలతో కూడిన ‘ఫాక్ట్ ఫైండింగ్’ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్ తరహాలోనే బెంగాల్లో కూడా ఎన్నికలను అక్రమంగా దక్కించుకున్నారని బీజేపీపై ఆమె ధ్వజమెత్తారు.
Read Also: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?