Narges Mohammadi Arrest: నోబెల్ గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్ నోబెల్ శాంతి పురష్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదిని.. ఇరాన్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె మద్దతురాలు, సంబంధిత స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ అరెస్టుపై ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన.. ఓ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలోనే.. నర్గెస్ మొహమ్మదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని అనధికారిక నిరసనగా పరిగణించిన భద్రతా బలగాలు ఆమెను అరెస్టు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నర్గెస్ మొహమ్మది పేరు ఇరాన్లో మానవ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. ముఖ్యంగా మహిళల హక్కులు, భావ స్వేచ్ఛ, ఆమె మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై అనేక కేసులు నమోదు కావడం, పలుమార్లు జైలు శిక్షలు అనుభవించడం జరిగింది. జైల్లో ఉన్న సమయంలోనే ఆమె తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, తన పోరాటాన్ని విరమించలేదు. జైలులో కొరడా దెబ్బల శిక్షను సైతం ఎదుర్కొన్న ఘటనలు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ దీర్ఘకాలిక పోరాటానికి గుర్తింపుగా 2023లో నర్గెస్ మొహమ్మదికి.. నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రత్యేకత ఏమిటంటే, ఆమె ఆ సమయంలో కూడా జైలులోనే ఉండడం. నోబెల్ కమిటీ ఆమె ధైర్యం, నిరంతర పోరాటం, ఇరాన్లో మహిళల హక్కుల కోసం చేసిన సేవలను ప్రశంసిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ నిర్ణయం ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేసిందన్న అభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి.
వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న నర్గెస్ మొహమ్మదికి ఆరోగ్య కారణాలను చూపుతూ.. 2024లో కొన్ని వారాల పాటు పెరోల్ మంజూరైంది. ఆ సమయంలో ఆమె వైద్య చికిత్స పొందడంతో పాటు, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై గళమెత్తారు. జాతీయ హక్కుల నేతలు, పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఆమెకు లభించిన ఈ ఉపశమనం కొనసాగుతూ వచ్చింది.
Also Read: అమెరికాలో భారీ పేలుడు.. 3 బిల్డింగ్లు తుక్కుతుక్కు
ఇటీవల 12 రోజుల పాటు కొనసాగిన ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కూడా.. ఆమె జైలుకు బయటే ఉన్నారు. ఈ సమయంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం, మీడియాతో ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఆమె మరింత చురుకుగా వ్యవహరించారు. ఈ కార్యకలాపాలే తాజా అరెస్టుకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.