Mamata vs Modi: పశ్చిమ బెంగాల్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాజకీయ పోరు ముదిరింది. ఆదివారం నాడు జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఒక గిరిజన మహిళా రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు రాగానే ప్రధాని ‘ఓటు పక్షి’లా బెంగాల్పై విమర్శలు గుప్పిస్తారని ఆమె మండిపడ్డారు.
ప్రధాని ఆరోపణలకు ప్రతిగా మమతా బెనర్జీ 2024 మార్చి నాటి ఒక ఫోటోను ప్రదర్శించి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎల్.కె. అద్వానీకి ‘భారత రత్న’ ప్రధానం చేస్తున్న సమయంలో.. రాష్ట్రపతి ముర్ము నిలబడి అవార్డు ఇస్తుంటే, ప్రధాని మోదీ పక్కనే కూర్చుని ఉన్న దృశ్యాన్ని ఆమె గుర్తుచేశారు. “గిరిజన నాయకురాలైన రాష్ట్రపతికి మీరే గౌరవం ఇవ్వలేదు.. ఆమె నిలబడి ఉంటే మీరు కూర్చుని ఉన్నారు” అంటూ మమత ధ్వజమెత్తారు. తాము రాజ్యాంగాన్ని, రాష్ట్రపతి పదవిని తల్లిలా గౌరవిస్తామని, తమపై నిందలు వేయడం ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఉత్తర బెంగాల్లోని బాగ్డోగ్రా వద్ద జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు. ఈ కార్యక్రమంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంపై రాష్ట్రపతి ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర మంత్రులు ఎవరూ తమకు స్వాగతం పలకడానికి రాకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే, ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, ప్రైవేట్ నిర్వాహకుల తప్పిదాలకు ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం సరికాదని మమత వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి బీజేపీ సలహా మేరకే మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ.. మణిపూర్, ఛత్తీస్గఢ్లలో గిరిజనులపై జరుగుతున్న దాడుల గురించి ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారని మమత ప్రశ్నించారు.
మరోవైపు సిలిగుడిలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రొటోకాల్ నిబంధనలను గాలికి వదిలేశారన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారులు రావాల్సి ఉండగా.. కేవలం మేయర్ స్థాయి అధికారితో సరిపెట్టడంపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, బెంగాల్ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి లేఖ రాశారు.
రాష్ట్రపతి విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సీఎస్, డీజీపీ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాష్రూమ్లో కనీసం నీటి సౌకర్యం కూడా లేకపోవడంపై వివరణ కోరింది. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే ప్రధాన రహదారులన్నీ చెత్తాచెదారంతో నిండి ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. సదస్సు నిర్వహణకు అనువైన పెద్ద వేదికను కాదని, ఇరుకైన ప్రదేశానికి చివరి నిమిషంలో ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలని ఆదేశించింది. ఈ వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంటూ డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్ (DM), సిలిగుడి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది.
Read Also: రియల్ లైఫ్ వాల్టర్ వైట్.. ఆగ్రాలో కెమిస్ట్రీ లెక్చరర్ డ్రగ్స్ అడ్డాపై తెలంగాణ పోలీసుల దాడి!