భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా రైల్వే మౌలికసదుపాయాలను మెరుగు పరుస్తోంది. రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్ ల అప్ గ్రేడ్ నుంచి.. రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మించడం వరకు కీలక పనులు చేపడుతుంది. ఇందులో భాగంగానే పూరి రైల్వే స్టేషన్ లో మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ కు వచ్చి వెళ్లే, రైలు సర్వీసు సుమారు 2 నెలలకు పైగా అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రైళ్లకు సంబంధించిన మార్పులు మార్చి 11 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మే 16 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సర్వీసులు ఖుర్దా రోడ్- పూరి స్టేషన్ల మధ్య ప్రయాణీకుల రాకపోకలను ప్రభావితం చేయనున్నాయి.
ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) అధికారులు ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు. పూరి నుంచి బయల్దేరే, పూరికి వచ్చే 30కి పైగా రైళ్లు ఈ పనుల కారణం ప్రభావితం కానున్నట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ఇబ్బంది కలగకుండా, సులభతరం చేయడానికి స్వల్పకాలిక రైళ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ రైల్వే స్టేషన్ ను పూరిలో వార్షిక రథయాత్ర వరకు అప్గ్రేడేషన్ పూర్తి చేయాలని రైల్వే అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు.
పూరి రైల్వే స్టేషన్ లో పనుల కారణంగా, లోకమాన్య తిలక్ టెర్మినస్–పూరి ఎక్స్ ప్రెస్, గాంధీధామ్–పూరి ఎక్స్ ప్రెస్, కామాఖ్య–పూరి ఎక్స్ ప్రెస్, తిరుపతి–పూరి ఎక్స్ ప్రెస్, సీల్దా–పూరి దురంతో ఎక్స్ ప్రెస్, వల్సాద్–పూరి ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్–పూరి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్తో సహా ఎనిమిది రైళ్లు పూరికి బదులుగా సఖిగోపాల్ స్టేషన్ నుంచి బయలుదేరి, అక్కడికే తిరిగి వస్తాయి.
అటు, ఇండోర్–పూరి ఎక్స్ ప్రెస్, శ్రీ గంగానగర్–పూరి ఎక్స్ ప్రెస్, కామాఖ్య–పూరి ఎక్స్ ప్రెస్, జలేశ్వర్–పూరి మెము రైలు సేవలు బిర్ పురుషోత్తంపూర్ స్టేషన్ లో ప్రారంభమై, అక్కడే ముగుస్తాయి. రూర్కెలా–పూరి ఎక్స్ ప్రెస్, తాల్చేర్–పూరి మెముతో సహా మరో నాలుగు రైళ్లు ఖుర్దా రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరి, అక్కడే ముగుస్తాయి. అటు హౌరా–పూరి ఎక్స్ ప్రెస్, పూరి–హౌరా ఎక్స్ ప్రెస్ లు మాలతిపట్ పూర్ స్టేషన్లో స్వల్పకాలిక ఆగుతాయి.
Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. ఆ వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మార్చిన అధికారులు!
పూరి స్టేషన్ లో మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ పనులను వేగవంతం చేయడానికి తాత్కాలిక ఏర్పాట్లు అవసరమని రైల్వే అధికారులు సూచించారు. రథయాత్రకు ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి, పూరి రైళ్లు తాత్కాలికంగా బయలుదేరే, ముగించే స్టేషన్ల మధ్య బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Read Also: కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ పర్యాటకానికి మరింత బూస్టింగ్.. IRCTC కీలక ఒప్పందం!