Hyderabad Drug Bust: నెట్ఫ్లిక్స్లో అత్యంత ఆదరణ పొందిన ‘బ్రేకింగ్ బ్యాడ్’ వెబ్ సిరీస్ గుర్తుంది కదా? అందులో ఒక సాదాసీదా కెమిస్ట్రీ టీచర్ క్యాన్సర్ బారిన పడి, తన కుటుంబం కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ తయారీని వృత్తిగా ఎంచుకుంటాడు. అచ్చం అదే తరహాలో, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ తన విజ్ఞానాన్ని సమాజ వినాశనానికి ఉపయోగించి భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (TGANB) పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్లో నమోదైన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈ భారీ ముఠా గుట్టురట్టయింది. నిందితుడు మనోజ్ కుమార్ (39) కెమిస్ట్రీలో ఎం.ఎస్సీ పూర్తి చేసి, 2014 నుండి వివిధ కళాశాలల్లో లెక్చరర్గా పనిచేశాడు. రాజస్థాన్లోని జోధ్పూర్లో పనిచేస్తున్న సమయంలో వీరేంద్ర స్వామి అనే సహోద్యోగితో ఏర్పడిన పరిచయం మనోజ్ జీవితాన్ని మలుపు తిప్పింది. 2026 జనవరిలో వీరేంద్ర స్వామి ఆహ్వానం మేరకు మనోజ్ కుమార్ హైదరాబాద్ చేరుకుని, అక్కడ ఒక అద్దె గదిలో ఉంటూ ‘MDMA’ డ్రగ్ తయారీకి విఫలయత్నం చేశాడు. భారీగా డబ్బు సంపాదించాలనే ఆశతో, కెమిస్ట్రీపై తనకున్న పట్టును ఉపయోగించి చివరకు ‘మెఫెడ్రోన్’ (Mephedrone) అనే ప్రమాదకరమైన డ్రగ్ తయారీకి సిద్ధమయ్యాడు.
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇన్స్పెక్టర్ పి. రమేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మనోజ్ కుమార్ ఆగ్రా జిల్లాలోని ఖండౌలి వద్ద ఒక షట్టర్ను అద్దెకు తీసుకుని రహస్యంగా డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. నిందితుడు బెంగళూరుకు చెందిన ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థ GST నంబర్ను ఉపయోగించి అంబాలా నుండి భారీగా కెమికల్స్ కొనుగోలు చేశాడు. సుమారు ₹4.5 లక్షల విలువైన ముడి పదార్థాలను సేకరించి, తన షట్టర్లో 10 కిలోల మెఫెడ్రోన్ను తయారు చేశాడు. ఈ డ్రగ్ను రాజస్థాన్కు చెందిన మనీష్ అనే వ్యక్తికి అప్పగించి, లక్షల రూపాయలు ఆర్జించాలని పథకం వేశాడు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో లభించిన సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు చెందిన ఈగిల్ ఫోర్స్ (EAGLE Force) బృందం ఆగ్రాకు వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో మనోజ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. నిందితుడు చూపిన రహస్య కేంద్రంలో సోదాలు చేయగా భారీ ఎత్తున రసాయనాలు, పరికరాలు లభించాయి. 450 లీటర్ల డిస్టిల్డ్ వాటర్, 120 లీటర్ల మిథైల్ అమైన్, ఇథైల్ ఎసిటేట్, ఎసిటోన్ వంటి భారీ నిల్వలను పోలీసులు గుర్తించారు. భారీ రౌండ్ బాటమ్ ఫ్లాస్కులు, వాక్యూమ్ పంపులు, డీప్ ఫ్రీజర్లు, గ్యాస్ మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేశారు. మేధస్సును మంచి పనుల కోసం వాడాల్సిన విద్యావంతుడు ఇలా నేరాల బాట పట్టడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.
Read Also: Tirupati DMart fraud: కేజీ పప్పుకు రూ.2899 బిల్లేసిన డిమార్ట్.. ఎఫ్సీఐ మాజీ సభ్యుడికి చేదు అనుభవం