హైదరాబాద్ మీర్పేట్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాపూర్-మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారిపై దాదునగర్ సమీపంలో కారు బోల్తా పడింది. కారు పల్టీ కొట్టడంతో అందులోని ఐదుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి నారా లోకేష్, జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతో భేటీ అయ్యారు. అమరావతి లేదా విశాఖలో ఆర్ అండ్ డి/ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ లేదా GCC ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అలాగే, విద్యలో వర్చువల్ క్లాస్రూమ్లు, టెలీ మెడిసిన్ కోసం వీడియో కన్సల్టేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. జూమ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడ వద్ద వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
జగిత్యాల జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో అలివేలు అనే మహిళను రోకలి బండతో నరేష్ హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం, మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. విషయం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా సావర్గావ్ గ్రామంలో.. స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో 14 మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. సావర్గావ్ నుంచి ఖండే బల్లూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వర్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి భర్త, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖలీద్ను బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారు. కర్ణాటక సరిహద్దులో ఇన్నోవా కారును ఆపి ఖలీద్ను తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేపట్టగా, ఖలీద్ తాండూర్ రఘునందన్ రెడ్డి ఇంట్లో నిర్బంధంలో ఉన్నట్లు గుర్తించి విడిపించారు. ఓటమి భయంతోనే కిడ్నాప్ చేశారని ఖలీద్ ఆరోపించారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. కోటి సంతకాలు ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా మీకు అనుమతి లేదు అని చెపుతూ అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్ దెందులూరులోనే ఎందుకు అని అబ్బయ్య చౌదరి పోలీసులను ప్రశ్నించారు.
గత ప్రభుత్వాలు ఉస్మానియా యూనివర్సిటీని అస్సలు పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేత దయాకర్. ఇప్పటికే అధికారులు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన DPR ను రెడీ చేశారని.. రానున్న రోజుల్లో ఓయూ స్వరూపమే మారబోతుందననారు. నేడు ఓయూకి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందంటున్న దయాకర్తో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మరో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే అతిథుల కోసం ఉపయోగించే పట్టు వస్త్రాలలో మోసం జరిగినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ పట్టు పేరుతో పాలిస్టర్ సరఫరా చేసినట్టు గుర్తించారు. 2014 నుంచి 2025 వరకు పట్టు పేరుతో పాలిస్టర్ శాలువాలు సరఫరా చేసింది VRS ఎక్స్పోర్ట్స్. విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఏసీబీ విచారణ కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది. మొత్తం 54 కోట్ల విలువైన శాలువాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది.
రియాల్టర్ వెంకటరత్నం హత్య కేసులో చందన్ సింగ్తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్ సుదేశ్ సింగ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని తెలిపారు. సుదేశ్ సింగ్ డ్రైవర్గా ఉన్న వెంకటరత్నం పేరుపై కొన్న ఆస్తులను తిరిగి ఇవ్వకపోవడంతో, సుదేశ్ మరణానికి వెంకటరత్నమే కారణమని భావించిన కొడుకు చందన్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తులపై.. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది హైకోర్టు. మరో రెండు సెట్ల నివేదికలను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు.. విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి ఠాగూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన బెంచ్కు ఒక సెట్ నివేదికను సమర్పించాలంది. కోర్టు ఆఫీసర్కు మరో నివేదిక అందజేయాలని.. హైకోర్టు రిజిస్ట్రీకి సూచించారు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్. రాజీ వ్యవహారంపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని CIDని ఆదేశించింది హైకోర్టు.
అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో భార్యాభర్తల మధ్య తగాదా భర్త ప్రాణాలను బలిగొంది. భార్య సెల్ఫోన్ సంభాషణ, అధిక వాడకం తగ్గించాలని భర్త మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త రాజారావుపై గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలైన రాజారావును చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, అనుచరుడు అన్బురాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎక్సైజ్ అధికారులు ఇద్దరిని, జోగి రమేష్ను విచారించేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతి జిల్లా అగరాలలోని నారాయణ కాలేజ్లో.. విండో నుంచి జారిపడ్డాడు ఓ విద్యార్థి. చెవి–ముక్కు–నోటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. జారిపడ్డ విద్యార్థి సెకండ్ ఇయర్ విద్యార్థిగా గుర్తించారు. స్టూడెంట్ రాత్రి హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు పైపులు పట్టుకుని దిగుతుండగా ఈ ఘటన జరిగింది. మరో ఆరుగురు స్టూడెంట్స్ కూడా పైపులపై కనిపించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో.. తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఎగ్ కోర్టు వ్యాపార సముదాయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్థిరత్వం, స్వయం ఉపాధి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక సమూహాలు, మహిళా శక్తీకరణ, ఉపాధి అవకాశాల విస్తరణ కోసం ఇలాంటి పథకాలు మరింత బలంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
గత 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వీటిలో కొసావో-సెర్బియా, భారత్-పాక్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్టు-ఇథియోపియా, అర్మేనియా అజర్బైజాన్ ఉన్నట్లు తెలిపారు. కానీ తాను ఇటీవల శాంతి ఒప్పందం కుదిర్చిన కంబోడియా, థాయ్లా లాండ్ మళ్లీ యుద్ధానికి దిగాయన్నారు. రేపు ఆ రెండు దేశాలతో ఫోన్లో మాట్లాడి యుద్ధాన్ని ఆపేస్తానన్నారు. బలంతో శాంతి నెలకొల్పుతానని వివరించారు.
క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘లింక్డిన్’ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన, క్లెయిమ్ చేయని నగదును దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు . ‘మీ డబ్బు.. మీ హక్కు’ అని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకుల్లో రూ.78 వేల కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.14 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో రూ.3వేల కోట్లు, డివిడెండ్లు రూ.9వేల కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పారు.
భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమకు బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్ దక్కినట్లు అమెరికా ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన ధాన్యాలు, సోయా విషయంలో మంచి ఆఫర్లు అందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం న్యూఢీల్లీలో చర్చలు జరుపుతున్నట్లు గ్రీర్ వివరించారు. అమెరికన్ వస్తువులకు భారతదేశం మంచి ప్రత్యామ్నాయ మార్కెట్ అని చెప్పారు.
బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తేరే ఇష్క్ మే సినిమా ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడుతూ.. చాలామంది హీరోలు నాకన్నా పొట్టిగా ఉన్నారు. ప్రభాస్, అర్జున్ కపూర్ నాకన్నా పొడుగుగా ఉంటారు అని చెప్పింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈ నెల 13న కోల్కతకు రానున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తొలి రోజు కోల్కతాలో ఆయన తన 70 అడుగుల విగ్రహాన్ని భద్రతా కారణాల వల్ల వర్చువల్ ఆవిష్కరించనున్నారు.