హైదరాబాద్ జవహర్నగర్ రియల్టర్ వెంకటరత్నం హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చందన్ సింగ్ తన తండ్రిని చంపారన్న కక్షతోనే వెంకటరత్నంను హత్య చేసినట్లు తేలింది. నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉండటం గమనార్హం. కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.
వనపర్తి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జిల్లాలోని 87 పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా, 82 చోట్ల పోలింగ్ జరుగుతోంది. మంగంపల్లిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 20.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు. సహచర పోలీసులు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ఫకీర్గూడెంలో పోలింగ్ కేంద్రాలను పచ్చని తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదర్శ కేంద్రాన్ని సందర్శించి, ఓటు వేసిన వారికి పూల మొక్కలు అందజేశారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ 3వ వార్డు అభ్యర్థి సిరాజ్ అడ్డంగా దొరికిపోయాడు. కెమెరాకు చిక్కడంతో భయపడి కిటికీలోంచి పారిపోయాడు. నందిగామలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు పంచినట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 5వ వార్డు మెంబర్ అభ్యర్థి విజయలక్ష్మికి ప్రమాదం జరిగింది. పోలీస్ వాహనం డోర్ తగలడంతో ఆమె ద్విచక్ర వాహనంపై నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆమె చెయ్యి విరిగింది, వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో పోలింగ్ కేంద్రం వద్దకు ఇరువర్గాలు ఒక్కసారిగా రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే స్పందించి జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. ఏసీపీ రమణమూర్తి కేంద్రం వద్ద ఎలాంటి ప్రచారం చేయొద్దని హెచ్చరించారు.
పోచారం సర్కిల్ ప్రతాపసింగారంలో కోతులు రెండు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నాయి. సుమారు 60 కోతులు గ్యాంగ్ వార్కు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణం వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. బాలుర కాలేజీ గ్రౌండ్లో భారీ వేదిక ఏర్పాటు చేశారు. పట్టణం మొత్తం కూటమి జెండాలతో కాషాయమయమైంది, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కోసం వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. మొత్తం 13 మందిలో ఇద్దరు గైర్హాజరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో ఆటో ఆపినందుకు పోలీసులపై భవానీలు, హిజ్రాలు దాడి చేశారు. బెంజిసర్కిల్, స్క్రూ బ్రిడ్జి వద్ద పోలీసులను హెల్మెట్తో, చేతులతో కొట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి, నిందితులపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధమయ్యారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తప్ప మరెవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ములుగు జిల్లా ఏటూరునాగారం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రచారం విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.
కడప మేయర్ ఎన్నికలో టీడీపీ కుట్రలను వైసీపీ ఐక్యతతో తిప్పికొట్టిందని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కార్పొరేటర్ల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థిని ఎంపిక చేశామని, ఎవరూ అసంతృప్తిగా లేరని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీ కుంట మండలం వంకమద్ధిలో పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉంది. గోడల పెచ్చులు రాలుతుండటంతో విద్యార్థులు బయట కూర్చుని చదువుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. తనకు మద్దతుగా వస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మాచర్లలో భారీ బందోబస్తు కొనసాగుతోంది.
భారత్లో పైలట్ల డ్యూటీ టైమ్ నిబంధనలు ఇతర దేశాల కంటే చాలా కఠినంగా ఉన్నాయని ఐటా చీఫ్ విల్లీ వాల్ష్ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఇండిగో విమానాలు రద్దవుతున్నాయని, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియా వెరిఫికేషన్ పేరుతో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను ఆకస్మికంగా వాయిదా వేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటర్వ్యూలు ఉండవని మెయిల్స్ రావడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వినయం, సేవాగుణం రతన్ టాటాను గుర్తుచేస్తాయని చిరంజీవి ప్రశంసించారు. హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చే రేవంత్ రెడ్డి విజన్ను కూడా చిరు కొనియాడారు.
రోహిత్ శర్మ తమను తిడితే అందులో ప్రేమ ఉంటుందని, ఆయన తిట్టకపోతే వెలితిగా ఉంటుందని యశస్వి జైస్వాల్ వ్యాఖ్యానించారు. రోహిత్, కోహ్లి అనుభవాలు తమకు ఎంతో నేర్పిస్తాయని ఆయన తెలిపారు.