జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. ఏఐసీసీ పిలుపు మేరకు ఎంజీ రోడ్డులో జరిగిన ఈ నిరసనలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ పాల్గొన్నారు. బీజేపీ కుట్రపూరితంగానే గాంధీ పేరును తొలగించిందని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సోమాజిగూడలో నివసించే ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా మోసం చేసిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిపై శారీరక దాడికి పాల్పడటమే కాకుండా.. పెళ్లికి నిరాకరించి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తేలింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణను చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో రూ. 3,050 కోట్లతో చేపట్టిన అమరజీవి జలధార పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లో 67.82 లక్షల మందికి రెండేళ్లలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందనుంది.
నిజామాబాద్లో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫోటోను ఆటోకు అంటించి తిరుగుతున్న డ్రైవర్ను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి.. వాహనాలపై కేవలం దేశభక్తులు, జాతీయ నాయకుల చిత్రాలనే ప్రదర్శించాలని సూచించారు. నేరస్తుల ఫోటోలను పెడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ మస్తాన్ అలీ హెచ్చరించారు.
జగిత్యాల జిల్లాలోని కృష్ణనగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి యజమాని సాగర్ 15 రోజుల క్రితం బెంగళూరు వెళ్లగా.. అదే అదనుగా భావించిన దుండగులు 30 గ్రాముల వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల ద్వారా ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సూర్యాపేట జిల్లా అడివేముల సర్పంచిగా బీఆర్ఎస్ అభ్యర్థి కలకోట్ల శైలేందర్ 55 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సర్పంచ్గా గెలిచినా తన వృత్తిని వదలనని.. ఆటో నడుపుకుంటూనే ప్రజాసేవ చేస్తానని ప్రకటించారు. అందరినీ కలుపుకుని గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శైలేందర్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నూర్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఓ కిరాణా దుకాణం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. ఒకే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వరుసగా వారి ఇల్లు, దుకాణం వద్ద ఇటువంటి పనులు చేస్తుండటంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ పరిధిలోని అటవీ భూములకు హద్దులు ఏర్పాటు చేశారు అధికారులు. దేవాదాయశాఖ, అటవీ అధికారుల మధ్య భూ వివాదం కొనసాగుతున్న క్రమంలో అటవీ అధికారులు మార్కింగ్ చేశారు. అటవీశాఖకు చెందిన సుమారు ఆరు ఎకరాల్లో ఆలయ ప్రధాన కార్యాలయంతో పాటు హరిత హోటల్, పార్కింగ్ స్థలం, వాహన పూజ స్థలం ఉన్నాయంటూ ఆగస్టు నెలలో ఆలయ అధికారులకు నోటీసులు జారీ చేశారు అటవీశాఖ అధికారులు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తీరుపై రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని స్వలాభం కోసం విభేదాలు సృష్టించడం, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలను విమర్శించడం అనైతికమని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా డేగులపాడులో దేవాదాయ భూమిలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 18 ఎకరాల్లో సాగు చేసిన మొక్కలను పోలీసు, రెవెన్యూ అధికారులు కూలీలతో పీకించి తగలబెట్టారు. సాగు చేసిన శివయ్య అనే వ్యక్తిని గుర్తించి.. ఈ భారీ అక్రమ సాగు వెనుక ఎవరెవరు ఉన్నారో విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తన బంధువులపై దాడులు చేస్తూ. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై మండిపడ్డారు. దీనికి కౌంటర్గా.. తాను పొత్తు ధర్మం పాటిస్తూ సంయమనంతో ఉన్నానని.. వ్యక్తిగత విమర్శలు చేయడం కాపు విజ్ఞతకే వదిలేస్తున్నానని కాల్వ స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి వెనక్కి వెళ్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. పట్టణంగా ఉన్న జంగమహేశ్వరంను గ్రామంగా మారుస్తూ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోలు, నవరత్నాల పట్టికలు ఉండటం వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలవుతున్నా అధికారులు వీటిని తొలగించకపోవడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, వెంటనే వాటిని తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. తమ ప్రమేయం లేకుండా తీర్మానాలు చేయడాన్ని నిరసిస్తూ ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. కమిషనర్ అబ్దుల్ రషీద్కు వారు డిసెంట్ నోటీసు’ అందజేశారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ కుమార్ను చైర్మన్ సస్పెండ్ చేశారు.
అదుపు తప్పి లారీ బోల్తా పడిన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో లారీ అదుపుతప్పిన ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. లారీ కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో పోలీసులు గాలింపు చేపట్టారు.
అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా చాలామంది దరఖాస్తుదారుల వీసా పాయింట్మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకు వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కొందరు ఉద్యోగులను హెచ్చరించింది. అమెరికాను వీడి బయటకువెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది.
తోషఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు మరో 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఇదే శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది.
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. గతేడాది నిరసనల్లో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడిన హాదీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి హింసాత్మక దాడులకు దిగారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో ఉదర సంబంధిత సమస్యతో ఇబ్బంది పడిన ఆయన.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
నటి రాధికా ఆప్టే సినీ రంగంలో తన 20 ఏళ్ల ప్రస్థానంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరంభంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల దక్షిణాది సినిమాలు చేశానని, ఆ సమయంలో సెట్స్లో తీవ్రమైన లైంగిక వివక్ష, భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.