డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 7న నిర్వహించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి సభ వాయిదా పడింది. గ్లోబల్ సమ్మిట్ ప్రిపరేషన్ షెడ్యూల్లో భాగంగా.. సీఎం సభను ఈనెల 10కి వాయిదా వేశారు. దీంతో.. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వీసీ, ప్రొఫెసర్లతో కలిసి అధికారులు యూనివర్సిటీలో పర్యటించాలని సూచించారు.
ఏపీకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆయన అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
ఎన్నికల్లో ఫైట్ చేయడం.. గెలవడం తన రక్తంలోనే ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనదైన శైలిలో స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని.. CM రేవంత్ ఆదేశిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వాన్ని, కార్యకర్తలను కలుపుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మేడిపల్లి సత్యానికి సూచించారు.
హైదరాబాద్ సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ ఐదో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం నుంచి పొగలు రావడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. రెస్టారెంట్లోని కస్టమర్లందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు.
శ్రీశైలం మహా క్షేత్రంలో ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏర్పాట్లపై ప్రాథమిక సమావేశం నిర్వహించారు ఈవో ఎం శ్రీనివాసరావు. జిల్లా యంత్రాంగం, దేవస్థానం బోర్డు సహాయ, సహకారాలతో సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులకు రిమాండ్ విధించారు. ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి సుమారు 8.50 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని ఒడిశాలోని కలిమెలా నుంచి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో నేరస్తులను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామ శివారు అటవీ ప్రాంతానికి పులి వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. మంచిర్యాల జిల్లా ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో పులి అడుగులను గుర్తించినట్లు చెప్పారు. గ్రామ శివారులోని పంట చేన్లలో విద్యుత్ వైర్లు పెట్టకూడదని హెచ్చరించారు అధికారులు.
సిద్దిపేట జిల్లా జంగపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పాతురి లావణ్యని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ ఎన్నికపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధి వైపు కొత్త దిశలో ప్రయాణం మొదలవుతుందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్ గుప్తా.. నూతన సర్పంచ్తో పాటు గ్రామ పాలక సిబ్బందిని సత్కరించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘర్షణ జరిగింది. పంచాయతీ ఎన్నికల మూడో విడత సందర్భంగా శంషారెడ్డిపల్లి తండా సర్పంచ్గా బానోత్ గణేష్ ఒక్కరే నామినేషన్ వేయగా.. చివరి నిమిషంలో ఆయన తనయుడు వినోద్ పోటీకి వచ్చారు. తండా వాసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన వినోద్ నామినేషన్ పత్రాలను చించివేశారు.
ఏలూరు జిల్లా గుండుగొలనుకులో ఓ యాచకురాలు నిజాయితీ చాటుకుంది. రోజువారీ పనులకు వెళుతున్న యాచకురాలు తిరుమలశెట్టి కరుణకు ఆటోలో 36 వేల రూపాయలు దొరికాయి. దీంతో ఆ నగదును వెంటనే భీమడోలు పోలీస్ స్టేషన్లో అప్పగించింది. అనంతరం కరుణ ఆమె చేతుల మీదుగానే ఆ డబ్బులను వ్యాపారి జువ్వల సత్యనారాయణకు అందజేశారు పోలీసులు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో జింకల వేట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు అరెస్ట్ అయ్యారు. అటవీశాఖ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి ఆయనను సత్తుపల్లి సబ్ జైలుకి తరలించారు.
కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో కిటకిటలాడింది. స్వామివారికి నిత్య కళ్యాణం, హోమం వంటి సేవలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతపురం జిల్లా కనేకల్ పట్టణంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దుండగులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం ఓ లబ్ధిదారుడి నుంచి 10వేలు లంచం డిమాండ్ చేశారు పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్. ఈ క్రమంలో బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాధితుడి నుంచి 5 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ మధు తన బృందంతో అతడిని పట్టుకున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. అంతకుముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అభినందన లేఖ పంపింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించగా.. నీతీశ్ కుమార్ పదోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో ఆయనకు చోటు లభించింది. ఓ రాష్ట్రాన్ని పదిసార్లు పాలించడం ప్రజాస్వామ్య చరిత్రలో అరుదైన ఘనత అని పేర్కొంటూ సీఎం నీతీశ్కు అభినందన లేఖ పంపించింది.
అఖండ 2 విడుదలకు సంబంధించి నిర్మాణ సంస్థ అప్డేట్ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ వివరాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అఖండ 2 విడుదల కోసం శాయశక్తులా కృషి చేశామని…అయితే ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడలేదని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఫిఫా పీస్ అవార్డ్ ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరణకు ట్రంప్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ఫిఫా శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు.