Telangana Sarpanch Elections: ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లు..ఊర్లలో పంచాయితీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. పల్లెల్లోని పార్టీల కార్యకర్తలు.. ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారట. ముఖ్యంగా రెబల్ కాండిడేట్స్ అయితే.. తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అయ్యా.. అవ్వా అంటూ బుజ్జగిస్తున్నా.. వినడం లేదట..
ప్రతీ పార్టీలో రెబల్స్ రుబాబు..
ఓరుగల్లు పల్లెల్లో.. పంచాయితీ పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రతీ పార్టీలో రెబల్స్ తమ రుబాబు చూపిస్తున్నారట. నియోజకవర్గ పెద్దలు ఎంపిక చేసిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ..తిరుగుబావుటా ఎగురవేస్తున్నారట. ఈ క్రమంలో పార్టీకి ఇద్దరు ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేస్తున్నారట. ఈ క్రమంలో రెబల్స్ను బుజ్జగించలేక ఎమ్మెల్యేల తల ప్రాణం తోకలోకి వస్తుందట.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 555 గ్రామాల్లో ఎన్నికలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 555 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ గ్రామాల్లో చాలా వరకు పార్టీలు రెబల్స్తో సతమతమవుతున్నాయట. సర్పంచ్ పదవి కోసం ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారని టాక్. వర్ధన్నపేట, స్టేషన్ఘన్ పూర్, పాలకుర్తి, పరకాల నియోజకవర్గాల్లో రెబల్స్ బెడదతో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి అధ్వాన్నంగా మారిందట.
రెబల్స్ నామినేషన్లతో ఎమ్మెల్యేలకు తలనొప్పి
రెబల్స్ నామినేషన్లతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించడం కత్తిమీదసాములా మారిందని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలవేళ, గ్రామాల్లోని రాజకీయాలను తట్టుకోవడం ఎమ్మెల్యేల వల్ల కావట్లేదట. ఇన్ని రోజులు తమ చుట్టూ తిరిగిన నేతలు సైతం తమ రూటే సెపరేట్ అంటున్నారట.
రెబెల్ అభ్యర్తికి సపోర్ట్ ఇవ్వమన్న పార్టీ
జనగామ జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్తికి సపోర్ట్ ఇవ్వమని పార్టీ చెప్పడంతో.. ఏకంగా కండువానే మార్చేశారట. జనగామ జిల్లాలోని జాఫర్ గడ్లో సర్పంచ్ బరిలో కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవగా.. ఓ అభ్యర్థిని బుజ్జగించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట. ఎవరు చెప్పినా.. వినేదేలేదు అంటూ తేల్చి చెప్పేస్తున్నారట. పార్టీ సపోర్టు లేకున్నా గెలిచితీరుతామంటూ తెగేసి చెబుతున్నారట. ఇక వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామంలో కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా ఆరుగురు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారట. ఎమ్మెల్యే నాగరాజు వారిని బుజ్జగించినా వినడం లేదట. దీంతో చేసేదేమి లేక.. మీరే తేల్చుకోండంటూ.. ఎమ్మెల్యే నాగరాజు వదిలేశారని టాక్.
నేతలనే ఎదిరిస్తున్న తిరుగుబాటు అభ్యర్థులు
అధికార పార్టీకే కాదు.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించొద్దని చెబుతున్న నేతలనే ఎదిరించి మాట్లాడుతున్నారంట. రేపు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు..ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదని.. అలాంటి వారు తమకు చెప్పేదేంది అంటూ బహిరంగంగానే ఫైర్ అవుతున్నారట. అయితే కొందరు ఎమ్మెల్యేలు..నామినేషన్లు ఉపసంహరించుకుంటే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. మరికొందరు కో ఆప్షన్ మెంబర్ ఇస్తామని హామీ ఇస్తూ వారిని కాకా పడుతున్నారట.
Also Read: పరకామణి చోరీ.. జగన్పై ఆగ్రహం..
ఎవరిని బుజ్జగించినా వినకపోవడంతో మీరే తేల్చుకోండి అంటూ పంచాయతీని వదిలేశారట ఎమ్మెల్యేలు. సర్పంచ్ అభ్యర్థుల విషయంలో తలదూరిస్తే మిగతా ఆశావహులకు నెగెటివ్ అవ్వాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు మధనపడుతున్నారట. కుల బలం ఉందని ఒకరు, గ్రామంలో మంచి పేరు ఉందని మరొకరు, గతంలో ఓడిపోయిన సింపతి ఉందని ఇంకొకరు అందరూ తమదే గెలుపు అంటూ వాదిస్తుండడంతో ఎవరిని బుజ్జగించాలో, ఎవరిని ప్రోత్సహించాలో తెలియక సైలెంట్ అవుతున్నారు ఎమ్మెల్యేలు.
Story By Kishan, Bigtv