సోనియా, రాహుల్ గాంధీలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా ఖండించారు. పార్టీ పదవి కోసం కేటీఆర్, హరీష్రావు గొడవ పడుతున్నారని.. ముందు కుటుంబ సమస్యలు చూసుకోవాలని ఎద్దేవా చేశారు. త్యాగాల కుటుంబంపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని, రాళ్లతో కొడతారని ఆయన హెచ్చరించారు.
భోగాపురం విమానాశ్రయంపై జగన్ వ్యాఖ్యలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జగన్ అబద్ధాలతో క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఇలాగే వదిలేస్తే దేశానికి స్వాతంత్ర్యం కూడా తన తాతే తెచ్చాడని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటల వల్లనే రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతోందని ఆయన మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా పాత కొండాపురంలో ఎన్నికల ఉత్కంఠ రాజకీయ కక్షకు దారితీసింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్-సీపీఎం కూటమి గెలుపును తట్టుకోలేక.. ఓటమిపాలైన కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రే బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చివేశారు. కాంగ్రెస్ అహంకారంతో గ్రామంలో అలజడి సృష్టిస్తోందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. సోయా, పత్తి పంటలను నిబంధనలు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర అతిథి గృహంలో అటవీ శాఖ సిబ్బంది మేకను బలి ఇవ్వడం కలకలం రేపింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా, ప్రసాద తయారీ విభాగం వద్దే జంతుబలి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఆలయ ఇన్స్పెక్టర్ సింహాచారి వెంటనే వారిని నిలువరించి, నిబంధనల ఉల్లంఘనపై హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా కనకమామిడిలోని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దుండగులు.. అమ్మవార్ల ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయినట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల విజయ పాలడైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలపాడు సొసైటీ ఎన్నికపై త్రిసభ్య కమిటీ విచారణకు భూమా విఖ్యాత్ రెడ్డి హాజరవుతుండటంతో.. పాల రైతులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. డైరీ ఛైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతుండటంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లపై సభ్యుల ప్రశ్నకు మంత్రి సీతక్క బదులిచ్చారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తెచ్చామని, 15 ఏళ్ల బాలికల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ స్వయం సహాయక సంఘాల్లో చేర్చి, దివ్యాంగులకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని మారిషస్ ప్రెసిడెంట్ ధరమ్ భీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు. కలెక్టర్, సీపీ, ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయగా.. దర్శనం అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు.
మేడారం జాతర ఆధునీకరణకు 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కుంభమేళాను తలపించేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈ నెల 19న మేడారం ఆధునీకరణ పనుల ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి.
తెలంగాణలో జనసేనను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా అడ్ హాక్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. ప్రధానంగా GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియమించనున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందిన రాక్సీ బ్యాక్ సహాయంతో రైళ్లలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఒంగోలు రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించిన సిబ్బంది ఎర్నాకులం ఎక్ప్రెస్ రైల్లో ఒంగోలు నుంచి కావలి వరకు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృష్ణ కిశోర్, ఆయన భార్య ఆశ మృతి చెందారు. వీరి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పది రోజుల క్రితమే ఊరొచ్చి వెళ్లిన ఈ దంపతులు, దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుని తిరిగి అమెరికా వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు జరిగాయి. మత్తు పదార్థాలు, కాలం చెల్లిన మందుల విక్రయాలపై సోదాలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడొద్దని నాణ్యమైన మందులే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. UAPA చట్టం కింద అరెస్టైన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మరో ఐదుగురు నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలున్నాయంది సుప్రీంకోర్టు.
జమ్మూ కశ్మీర్పై బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్ను పాక్ ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని.. ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా 1992లో కశ్మీరీ పండితుల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోగా, రాజస్థాన్లో పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసి రహదారులు కనిపించలేదు. కశ్మీర్లో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా ఉండటంతో రాబోయే రోజుల్లో లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఓటర్ల జాబితా సవరణ ఏకపక్షం, లోపభూయిష్టంగా ఉందంటూ ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ లేఖ ద్వారా మండిపడ్డారు. ఐటీ వ్యవస్థల దుర్వినియోగంతో ఓట్లు తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించారు. అనేకమంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నందున, ఈ కసరత్తును వెంటనే నిలిపివేయాలని సీఈసీ జ్ఞానేశ్కుమార్ను ఆమె డిమాండ్ చేశారు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేయకపోవడంపై రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రుతురాజ్ ఓపెనింగ్తో పాటు మిడిలార్డర్లోనూ రాణించగలడని.. స్పిన్ను అద్భుతంగా ఆడతాడని ప్రశంసించాడు. రోహిత్, కోహ్లీల తర్వాత వన్డేల్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించే సత్తా అతడికి ఉందని, రెండో కీపర్ కంటే రుతురాజ్ ఎంపికే సరైనదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా దీని ట్రైలర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. మొదట ఈ ట్రైలర్ను రామ్ చరణ్ చూశారని.. చూడగానే అద్భుతంగా ఉందని ప్రశంసించారని చెప్పారు.