Vande Bharat Sleeper Foods: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది. హౌరా-గౌహతి మార్గంలో తొలి స్లీపర్ రైలు పరుగులు తీయబోతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కాబోతోంది. గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించింది. మోడీ ప్రభుత్వం అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టింది. రైల్వే ప్రయాణ వేగాన్ని పెంచింది. ప్రయాణీకులకు ట్రావెల్ టైమ్ ను తగ్గించింది. రాత్రి పూట ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు సేవలను ప్రారంభించబోతోంది.
ఈ కొత్త సెమీ హై స్పీడ్ సర్వీస్ హౌరా- గౌహతి మధ్య సర్వీసులు అందించనుంది. ఈ నెల చివరలో ఈ రైలు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు, ప్రభుత్వం వేగం, సౌకర్యాన్ని ప్రాంతీయ సంస్కృతితో కలపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైలు నడిచే రూట్ లో ప్రయాణీకులకు ప్రాంతీయ వంటకాలను అందించాలని నిర్ణయించింది. గౌహతి నుంచి బయలుదేరే రైళ్లలో సాంప్రదాయ అస్సామీ వంటకాలు అందుబాటులో ఉండగా, కోల్ కతాలోని హౌరా నుంచి బయలుదేరే రైల్లో బెంగాలీ వంటకాలను అందించనున్నారు. ప్రయాణీకులు జర్నీ సమయంలో రుచికరమైన బెంగాలీ వంటకాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.
Read Also: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!
వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లోని రైల్వే మార్గాల్లో ముర్గిర్ జోల్, కోషా పన్నీర్ లాంటి బెంగాలీ వంటకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటికి మరిన్ని స్థానిక వంటకాలను యాడ్ చేయాలని రైల్వే భావిస్తోంది. అదే సమయంలో అస్సామీ వంటకాలను కూడా మెనూలో చేర్చాలని నిర్ణయించింది. రైలు ప్రారంభం అయ్యేనాటికి మెనూ కూడా రెడీ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే స్థానిక రైల్వే నుంచి లోకల్ వంటకాల జాబితాను అడిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా వందేభారత్ రైళ్లలో స్థానిక వంటకాల రుచి చూపించే దిశగా భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. గౌహతి-హౌరా మార్గంలోనే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఇదే పద్దతిని ఫాలో కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: లోకో మోటివ్ మీద ఏఐ కెమెరాలు, వన్యప్రాణులు చనిపోకుండా రైల్వే కీలక నిర్ణయం!