విశాఖలో సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఆమె సీఎంతో చర్చించారు. అంతేకాకుండా షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై ఆమె ఆసక్తి కనబర్చారు. గ్లోబల్ బ్రాండ్గా అరకు కాఫీ మారిందని సీఎం వివరించారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి. కుప్పం మండల పరిధిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుర్మానిపల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న ఉన్న వ్యక్తిపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి. గజ బీభత్సంతో పరిసరాల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో భక్తుల కోసం AI చాట్బాట్ను ప్రారంభించనుంది. ఇక నుంచి భక్తులు శ్రీవారి దర్శనం, సేవలు, వసతి గదుల వివరాలు, ఇతర ముఖ్య సమాచారం వేగంగా తెలుసుకోవచ్చు. ఈ చాట్బాట్ 13 భాషల్లో సేవలు అందించనుంది. ఈ సేవలు అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వేసిన టెండర్కు ఆమోదం లభించింది. ఏడాదికి రూ. 50 లక్షలకే ఈ సేవలు అందించనుంది
అటవీ భూములు ఆక్రమణలపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి.. వాటిని ఆక్రమించిన వారు, ఆక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులు అవుతారన్నారు. ఫారెస్ట్ ల్యాండ్స్ జోలికేళ్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు
అనకాపల్లి జిల్లా చోడవరం ద్వారకా నగర్ శివారులో దారుణం జరిగింది. ఆరు నెలల బాబును చంపి పోరెడ్డి వీణ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా రాచర్లలో కొండచిలువ కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఓ అరటి తోటలో అరటి చెట్ల మధ్యన కొండచిలువను గుర్తించిన రైతు హడలిపోయాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించి స్థానిక నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం షారాఫ్ బజార్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు జ్యూవెలరీ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్ను మీడియా వివరణ కోరగా వివిధ దేవాలయాల్లో వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో విచారణ నిమిత్తం వచ్చామన్నారు. అనంతరం 4 కేజీల వెండి ఆభరణాల రికవరీ చేశారు. పట్టణానికి చెందిన ఒక నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఏలూరు జీవీ మాల్ సమీపంలోని ఓ వైన్ షాపులో చోరీ జరిగింది. SR వైన్ షాప్ లో సుమారు లక్షన్నర విలువ చేసే మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఇదే వైన్ షాప్ లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన కేసులో ఇప్పటికే షాపును సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. సీజ్ చేసిన షాపులో తాళాలు పగుల కొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు.
విదేశాల నుండి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న ఐఫోన్లు, సాంసంగ్, ఆపిల్ వాచ్ లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి సుమారు 71 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు 10వ వార్డులో మున్సిపల్ అధికారులను స్థానికులు, జన సేన కార్యకర్తలు అడ్డుకున్నారు. డ్రైనేజీ, రోడ్డు పనులను తక్షణమే నిలిపి వేసేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వేడుకున్నారు. తక్షణమే పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. కదిరి, మదనపల్లి, పుంగనూరు డయాలసిస్ సెంటర్స్ టెక్నీషియన్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ ఆస్పత్రిని మూసేశారు అధికారులు. DHO, DEO తదితరులు అపోలో డయాలసిస్ను కూడా తనిఖీ చేశారు. తర్వాత గ్లోబల్ ఆస్పత్రిని తనిఖీ చేసి ప్రాధమిక విచారణ ముగించారు. నివేదికను పై స్థాయి అధికారులకు, జిల్లా కలెక్టర్ కి సబ్మిట్ చేయనున్నట్టు చెప్పారు.
కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ రెండోరోజు సుదీర్ఘంగా విచారించింది. నెయ్యి టెండరు నిబంధనల మార్పుపై అప్పటి ఛైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారని..తాను చేసింది తప్పయితే ఆమోదించిన వారిదీ తప్పేగా ధర్మారెడ్డి సిట్ అధికారులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఛైర్మన్ చెప్పినట్టు నడుచుకోవాలని.. ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు ధర్మారెడ్డి. దాంతో మిన్నకుండపోవలసి వచ్చిందన్నారు.
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ ముగియడంతో తుది ఫలితంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది టెన్షన్ రేకెత్తిస్తోంది. దీంతో రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అన్నిపార్టీల నేతలతో పాటు, తెలంగాణ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేపు ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కౌంటింగ్ కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మారు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్లోని ఓం నగర్ కాలనీలో వరుసగా మూడు ఇళ్లల్లో చోరీ చేశారు. ఒక ఇంట్లోకి చొరబడి 30 తులాల బంగారం, మరో రెండు ఇళ్లల్లోకి వెళ్లి విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సంఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. బాధితులు ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అల్ఫలా యూనివర్సిటీపై NIA అధికారులు ఫోకస్ పెట్టారు. కొందరు వైద్యులు ఆ యూనివర్సిటీని ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. గతంలో జామియా, అలీఘడ్ వర్సిటీ పోటీనిచ్చిన అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు ఇలా మారింది. ఐ20 కారును డ్రైవ్ చేస్తూ మరణించిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే వర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. 2900 కిలోల పేలుడు పదార్థాలతో అరెస్టైన డాక్టర్లు ముజమ్మిల్, షాహీన్లు ఇదే వర్సిటికీ చెందినవారు. బ్లాస్ట్ తర్వాత అల్ఫలా వర్సిటీ ప్రొఫెసర్ మిస్సింగ్డాక్టర్ నిసార్ ఉల్ హసన్ మిస్ అయ్యాడు. గతంలో అతడిపై ఉగ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో ఈనెల 24 సాయంత్రం నుంచి రెండు రోజులపాటు రామ్లల్లా దర్శనం ఉండదు. నవంబరు 26 ఉదయం 7 గంటలకు దర్శనం పునఃప్రారంభం అవుతుంది. 25న రామమందిర శిఖర ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఢిల్లీలో పీల్చే గాలిలో నాణ్యత తగ్గిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 500గా నమోదైంది. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసా సంస్కరణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనన్నారు. తమ వద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని ట్రంప్ తెలిపారు.
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ సరికొత్త హంగులతో ముస్తాబై ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చిరంజీవి అన్నారు. ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు.