స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు రేపు సమావేశం కానుంది తెలంగాణ కేబినెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అందెశ్రీ మృతికి సంతాపం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి వెళ్లారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె.. వారికి ధైర్యం చెప్పి.. ఓదార్చారు.
తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్కు కోటి 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఇవాళ హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి నజరానా ప్రకటించారు.
టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. వరుసగా మూడో రోజు డమ్మీ బొమ్మలతో సీన్ రీక్రియేషన్తో దర్యాప్తు చేస్తున్నారు. నడుస్తున్న రైలులో నుంచి పోలీసులు బొమ్మలను కిందకు తోసేసి, ఏ భాగానికి గాయలవుతాయన్న విషయాలను పరిశీలించారు. గుత్తి నుంచి రెండు రైళ్లలో ప్రయాణించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఆలస్యం చేస్తున్నారంటూ స్పీకర్పై కేటీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంది. స్పీకర్ కార్యాలయం అదనపు గడువు కోరుతూ వేసిన పిటిషన్ను కూడా కోర్టు విచారించనుంది.
కరీంనగర్ రూరల్ తహసిల్దార్ ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ కడారి శ్రావణ్ కుమార్ ఆత్మహత్య కేసులో సీఐ శ్రీలతపై వేటు పడింది. ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భార్యతో గొడవ కేసులో పోలీస్ స్టేషన్కు వెళితే తనను సీఐ వేధించారని ఆరోపిస్తూ.. శ్రావణ్ సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆగి ఉన్న ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్, ఇతర సాంకేతిక లోపం కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా విద్యార్థినుల కోసం బయో టాయిలెట్స్ను ఏర్పాటు చేసింది. స్కూల్ వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో టాయిలెట్ల కంటెయినర్ను ఏర్పాటు చేశారు. కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేయడం విశేషం.
పార్టీ-ప్రభుత్వ సమన్వయానికి వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్. రెండేళ్లలో పార్టీలోకి వచ్చినవారు నిలబడతారో లేదో తెలియదని, కలుపు మొక్కలలాంటి వారిని ఏరిపారేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం, పార్టీ నాయకత్వం కృషితో విజయం సాధించామన్నారు.
రంగారెడ్డి జిల్లా పరువు హత్యపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ హత్యకు నిరసనగా షాద్నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. రాజశేఖర్ కిడ్నాప్కు గురయ్యారని డయల్ 100కు కాల్ చేసినా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దోషులను శిక్షించాలని.. మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్పల్లి ఎకో పార్క్లో జరిగిన జర్నలిస్టు కుటుంబాల గెట్ టు గెదర్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. విమలక్క, మంగ్లీ, మంచు మనోజ్ , నల్గొండ గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జర్నలిస్టులతో కలిసి లంచ్ చేశారు.
ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో పడి రామానగరం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పిల్లి ఆనందరావు మృతి చెందారు. బేతుపల్లి గంగారం మత్స్య శాఖ సొసైటీలో సభ్యుడైన ఆనందరావు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో 91 ప్రైవేట్ కంపెనీలతో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే కూనంనేని, సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ ప్రారంభించారు. 5,000 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.
మహబూబ్నగర్ జిల్లా ఉదండాపూర్ భూనిర్వాసితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. 146 కోట్ల R&R ప్యాకేజీని ఫైనాన్స్ అప్రూవ్ చేసిందన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి, ప్యాకేజీపై క్యాబినెట్ అప్రూవల్ కోసం సీఎం రేవంత్రెడ్డిని కలుస్తానని తెలిపారు. జడ్చర్లలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే.
ప్రకాశం ఒంగోలు RWS EE నాగేశ్వరరావు తన కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ఒంగోలు కాంట్రాక్టర్ రామాంజనేయులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ప్రపంచ బ్యాంకు నిధులు 14 వేల కోట్లను బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఓట్లు కొనేందుకు 40 వేల కోట్లు ఖర్చు చేసిందని ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 1.14 లక్షలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 1.25లక్షలకు చేరుకుంది. ఇక వెండి ధర 100 పెరిగి కిలో 1.75 లక్షలుగా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలాగే ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. mCASH సర్వీస్ ద్వారా డబ్బు పంపడం, క్లెయిమ్ చేసుకునే సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2025 నవంబర్ 30 తర్వాత ఇది అమల్లోకి రానుంది. ఆ తేదీ తర్వాత కస్టమర్లు ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్ ద్వారా mCASH సేవను వాడుకోలేరు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రానున్న అఖండ 2 సినిమాను 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారతీయ సినామాలో గొప్ప అనుభూతిని పంచే విధంగా ఈ సీక్వెల్ ఉంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న విడుదల కానుంది.
కోల్కతా టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమై 93 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 15 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ మ్యాచ్లో ఓటమిపాలైంది.