భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం సాయంత్రం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
20 మంది వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జిల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే కొత్త ఇంఛార్జిలను నియమిస్తానని అన్నారు. చాలా మంది నాయకులు నియోజకవర్గాల్లో తిరగకుంటే వేరేవారిని చూసుకుంటామని హెచ్చరించారు.
మెదక్ జిల్లా టేక్మల్ ఎస్సై అరెస్టుపై డీజీపీ ఏసీబీని, డీజీ చారు సిన్హా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సై అరెస్టు తర్వాత ప్రజలు సంబరాలు చేసుకోవడం పోలీసులపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా బేగంపేట చేరుకోనున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. కోర్టు విచారణ అనంతరం లోటస్ పాండ్కు, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని బెంగుళూరుకు వెళ్లనున్నారు.
అల్లూరి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి. లంబసింగి 7,చింతపల్లి 9, పాడేరు10, అరకులోయలో 16 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలనే డిమాండ్తో డీఎస్పీ ప్రసన్న కుమార్తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మృతుడి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సహాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినా, విశారదన్ మహారాజ్ ఎస్సై సస్పెన్షన్కు పట్టుబట్టారు. ఎస్సీలను అంటరానివారిగా చూస్తున్నారని, ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలి ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్థాయి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏకపాత్రాభినయంతో మరోసారి ఆకట్టుకున్నారు డాక్టర్ అలేఖ్య పుంజాల. 70 నిమిషాలపాటు నాన్స్టాప్ అభినయ వాచకంతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేశారు. త్రిప్ప కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, సూత్రధార్ యాక్టింగ్ ట్రైనింగ్ సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఆమె దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని మాచారం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు ముందు భాగం ధ్వంసమైనప్పటికీ, ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూలు ప్రకటించింది. నేటి నుంచి ఈనెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించనున్నారు.
బీఆర్ఎస్, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రైతులను రెచ్చగొట్టి బద్నాం చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వాళ్ల ఇంట్లో కుంపటిని రాష్ట్రం అంతా పెట్టొద్దని సూచించారు. ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టినా గులాబీ పార్టీ నేతలకు బుద్ధి మారలేదన్నారు మంత్రి తుమ్మల.
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ పార్కింగ్ విషయంలో యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు, దుకాణం యజమానిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో యజమాని తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని రిమ్స్కు తరలించారు.
తెలుగు రాష్ట్రాలను చలి గజగజా వణికిస్తోంది. చలి తీవ్రతకు ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీ విలువైన అస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు సిట్ అధికారులు.
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోంది. మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సౌదీకి వెళ్లారు. మదీనాలోనే ఉన్నారు. సోమవారం రాత్రి సౌదీ అరేబియాకు చేరుకున్న మంత్రి.. అప్పటి నుండి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లో భారీ రద్దీతో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ క్యూలో కిందపడి మరణించింది. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం గాజా స్ట్రిప్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు సమాచారం. ఈ మేరకు గాజా డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
హెచ్-1బీ వీసా ఉద్యోగులను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఉందని అంగీకరించారు. ఈ విషయాన్ని ‘మాగా’ మద్దతుదారులు అర్థం చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరమ్లో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
20 నెలలుగా ప్రపంచ వేదికల్లో ఎక్కడా పతకం సాధించని ప్రపంచ మాజీ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు పోడియంపై నిలవబోతోంది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో ఈ తెలంగాణ బాక్సర్ తుది పోరుకు అర్హత సాధించడం ద్వారా పతకం ఖాయం చేసుకుంది. మహిళల 51 కేజీల సెమీఫైనల్లో నిఖత్.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ గనీవా గుల్సెవర్ను ఓడించింది. జడ్జిలు ఆమెను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు. ఫైనల్లో ఆమె.. గువో జి జువాన్ని ఢీకొంటుంది.
ప్రేమంటే కథ విన్నప్పుడే చాలా వినూత్నంగా అనిపించిందన్నారు నటుడు ప్రియదర్శి. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో లవ్ ట్రాటప్ వేడుక నిర్వహించారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ మధ్యే నిజమైన ప్రేమ అంటే తెలిసిందని.. నా బాగోగులు కోరుకుంటూ, చిన్న కామెంట్ రూపంలోనూ నాపై అభిమానం చూపిస్తూ ప్రోత్సహిస్తున్నారు.