రంగారెడ్డి జిల్లాలోని కనకమామిడి వద్ద హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొనడంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నాయి. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేతకు పాల్పడుతున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు.
ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి ఊహించని స్థాయిలో జనం మద్దతు లభిస్తోంది. రవిని అరెస్ట్ చేసినందుకు పోలీసులను సినీ ప్రముఖులు అభినందిస్తుంటే, ప్రజలు మాత్రం రవిని హీరోగా అభివర్ణిస్తున్నారు. తాజాగా రవి తరఫున కోడి కత్తి కేసు లాయర్ సలీం రంగంలోకి దిగారు. ఈ కేసులో ఈజీగా బెయిల్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి నారాయణ రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండ రాయునిపాలెంలో పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, పాఠశాల భవనాలను ఆయన పరిశీలించారు. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు అందుతాయన్నారు మంత్రి.
పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని నాగార్జునసాగర్ కుడి కాల్వకు గండి ఏర్పడింది. దీని కారణంగా భారీగా నీరు నాగులేరు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాగులేరు కిందనున్న పరివాహక ప్రాంత గ్రామాల రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నంద్యాల జిల్లా కొణిదెల గ్రామంలో చాపల మహేష్ అనే రైతు పొగాకు పంట దగ్ధమైంది. నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు అనుమానిస్తున్నాడు. దాదాపు 3లక్షల నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి పరకామణి కేసు విచారణ విజయవాడకు మారింది. CID అధికారులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. నిందితుడు రవికూమార్ను మరోసారి విచారణ చేయనుంది CID. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో.. కేసుకు సంబంధించిన వారికి సెక్యూరిటీ కల్పించింది పోలీస్ శాఖ.
స్మార్ట్ సిటీగా పేరొందిన తిరుపతిలో హమీద్ పేటలోని ఊటకుంట పాఠశాల దుస్థితి.. నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏడాదిలో మూడు నెలల పాటు పాఠశాలకు నీరు ఊటగా వస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులతో పాటు పాఠశాల ఆవరణమంతా నీటితో నిండిపోవడంతో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు.
ఐబొమ్మ రవిపై పోలీసులు మరో మూడు ఫోర్జరీ సెక్షన్లు జోడించారు. ఇప్పటికే IT యాక్ట్, BNS, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు ఉన్నాయి. ప్రహ్లాద్ పేరిట పాన్కార్డ్, లైసెన్స్, RC తయారు చేసినందుకు కోర్టులో మెమో దాఖలు చేశారు. విదేశీ పాట్నర్ల వివరాలపై ఆరా తీయనున్నారు పోలీసులు.
ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా గంగపుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
జగిత్యాల జిల్లా పొలాసలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హర్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. అరవింద్కు చెందిన రెండెకరాల వరిపంట కోస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. డ్రైవర్ గమనించి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. వడ్లతోపాటు యంత్రం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
కూతురు ఇతర సామాజిక వర్గం అబ్బాయిని ప్రేమించిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా హన్మసానిపల్లిలో జరిగింది. కూతురు గౌతమి ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో తండ్రి కౌల్ల ఎల్లయ్య మనస్తాపంతో వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీ సత్యసాయి బాబా శతజయంతికి పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ శతజయంతి మహోత్సవాలు విశ్వసమాజాన్ని ప్రేమ, సేవ మార్గంలో నడిపించే స్ఫూర్తిదాయక వేడుకలుగా కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలైంది. భారీ బాహుబలి సెట్టింగ్తో పెళ్లి వేదికను ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ వివాహానికి మాజీ సీఎం జగన్ హాజరు కానున్నారు.
కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర, దక్షిణ కోల్కతాలోని వివిధ ప్రాంతాలలో ఉదయం 10 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదైంది.
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. నవంబర్ 21 నుంచి 23 వరకు జోహన్నెస్బర్గ్లో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. భారత్, ప్రపంచ దక్షిణ దేశాల సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దాని కోసం డీకే వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సీఎం మార్పుపై వీరు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటం మెక్సికో భామను వరించింది. థాయ్లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్.. ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా దూరమయ్యే అవకాశాలున్నాయి. గిల్ ఫిట్నెస్పై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిల్ ఆడకపోతే రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడు. పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే అతడికి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. గిల్ కోలుకోవడానికి ఇంకా పది రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం.
హీరో రామ్ పోతినేని, మహేష్బాబు దర్శకత్వంలో రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఉపేంద్ర ఆసక్తికర విషయం చెప్పారు. ఆంధ్ర కింగ్ పాత్ర తాను లేదా రామ్ పోతినేని కాదని, సినిమాలో మరో వ్యక్తి ఉన్నాడని ఉపేంద్ర ప్రకటించారు. ఈ ట్విస్ట్తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.