Twitter: సోషల్ మీడియా యాప్స్ మధ్య పోటీని తట్టుకోవడానికి యాప్స్ అన్నీ కొత్త కొత్త టెక్నిక్స్తో ముందుకొస్తున్నాయి. ఒక యాప్ ఒక కొత్త రకమైన అప్డేట్ను ప్రవేశపెట్టగానే దానికి మించిన అప్డేట్ మరొక యాప్ దగ్గర సిద్ధంగా ఉంటుంది. ఇక ఎలన్ మస్క్ ట్విటర్ను కొన్న తర్వాత ఆ యాప్ విషయంలో ఎన్నో మార్పులు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక లిండా యాక్కరినోను ట్విటర్ను సీఈఓగా ప్రకటించిన తర్వాత మస్క్ మొదటిసారి ఒక అప్డేట్తో ముందుకొచ్చాడు.
ఇప్పుడు ట్విటర్ యూజర్లు ఏకంగా 2 గంటల నిడివి ఉన్న వీడియోలను అప్లోడ్ చేయవచ్చని ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించాడు. కాకపోతే దానికి ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఉండాలని తెలిపాడు. ఈ రెండు గంటల వీడియో 8 జీబీకి మించి ఉండొద్దని అన్నాడు. ఇప్పటికే ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో మార్పులు జరిపిన ట్విటర్.. ఒకప్పుడు 60 నిమిషాల వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు అనే ఫీచర్ను 2 గంటలకు పెంచింది. ట్విటర్ బ్లూ విషయంలో మార్పులు జరిపినప్పుడే యాజమాన్యం.. ఈ వీడియోల విషయంలో కూడా మార్పులు జరుగుతాయని హింట్ అచ్చింది.
ఒకప్పుడు ట్విటర్ యూజర్లు వీడియోలు అప్లోడ్ చేయడానికి కేవలం 2 జీబీని మాత్రమే అనుమతించేది. కానీ ఇప్పుడు ఆ సైజ్ 8 జీబీకి పెరిగింది. ఒకప్పుడు ట్విటర్ను వెబ్లో ఉపయోగిస్తున్నవారు మాత్రమే పెద్ద వీడియోలను అప్లోడ్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఐఓఎస్ యాప్ నుండి కూడా ఇది సాధ్యమవ్వనుంది. వీటన్నింటి విషయంలో మార్పులు జరిగినా కూడా వీడియోల క్లారిటీ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. ఒకప్పటి లాగానే వీడియో క్వాలిటీ మ్యాక్సిమమ్ 1080పీ ఉండాలని ట్విటర్ తెలిపింది.
ట్విటర్లో 2 గంటల వీడియో అప్లోడ్ గురించి ఎలన్ మస్క్ ట్వీట్ చేయగానే యూజర్లు అంతా వివిధ రకాలుగా రియాక్ట్ అయ్యారు. ఒక యూజర్ అయితే ట్విటర్ అనేది మెల్లగా నెట్ఫ్లిక్స్ లాగా మారిపోతుంది అని కామెంట్ చేశాడు. మరొకరు ‘వెల్కమ్ టు ట్వీట్యూబ్’ అని వ్యంగ్యంగా స్పందించారు. లిండా యాక్కరినోను ట్విటర్కు కొత్త సీఈఓగా ప్రకటించిన తర్వాత మస్క్ తీసుకొచ్చిన మొదటి మార్పు ఇదే. గతేడాది 44 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ట్విటర్ను కొన్న విషయం తెలిసిందే.