ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, జిడ్డు చర్మం ఇప్పుడు చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్లు వాడినా కొందరికి సరైన ఫలితం కనిపించదు. కానీ ఆరోగ్య నిపుణులు చెప్పే మాట ఏంటంటే.. చర్మం అందంగా కనిపించాలంటే బయట నుంచి తీసుకునే జాగ్రత్తలు సరిపోవు. మనం తినే ఆహారం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని పురాతన ధాన్యాలు చర్మానికి సహజ మెరుపు ఇవ్వడంలో సహాయం చేస్తాయి.
ఈ చిరు ధాన్యాలు తింటే…
చిరుధాన్యాలు ఇప్పుడు మళ్లీ ప్రజల భోజనంలో స్థానం సంపాదిస్తున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి ధాన్యాల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మ సమస్యలు తగ్గించడంలో కూడా సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా వచ్చే వాళ్లు ఈ ధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది.
సజ్జలు, రాగులు తింటే…
సజ్జల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ చర్మంలో ఆయిల్ ఎక్కువగా తయారుకాకుండా సహాయం చేస్తుంది. ముఖం జిడ్డుగా మారితే మొటిమలు త్వరగా వస్తాయి. అందుకే సజ్జలు తింటే చర్మం సమతుల స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చర్మంలో వచ్చే వాపు కూడా తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
రాగుల్లో పాలీఫెనాల్స్, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ కణాలకు బలం ఇస్తాయి. కొల్లాజెన్ తయారీకి కూడా సహాయం చేస్తాయి. కొల్లాజెన్ సరైన స్థాయిలో ఉంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. రాగి జావ, రాగి సంగటి వంటి ఆహారాలు వేసవిలో శరీరానికి చల్లదనం కూడా ఇస్తాయి.
కొర్రల్లో విటమిన్ E, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కాలుష్యం, దుమ్ము, ఒత్తిడి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. నగరాల్లో ఎక్కువసేపు బయట తిరిగేవాళ్లకు కొర్రలు మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. జొన్నల్లో సిలికా, బీ విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మం పొడిబారకుండా కాపాడటంలో సహాయం చేస్తాయి.
సామలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయం చేస్తాయి. రక్తంలో చక్కెర ఎక్కువైతే చర్మంలో ఆయిల్ ఉత్పత్తి పెరిగి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు చర్మానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చిరుధాన్యాల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఆరోగ్యం బాగుంటే చర్మం కూడా ఆరో్యంగా కనిపిస్తుంది. చాలామంది గమనించే విషయం ఏంటంటే.. జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు మొటిమలు పెరుగుతాయి. అదే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చర్మంలో మార్పు కనిపిస్తుంది.
అయితే చిరుధాన్యాలు మాత్రమే తింటే మొటిమలు పూర్తిగా పోతాయని అనుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. తగినంత నీరు తాగడం, సరైన నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం కూడా చాలా ముఖ్యం. అలాగే చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం, ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే చర్మానికి మేలు జరుగుతుంది. మొటిమలు తీవ్రమై చాలా రోజుల పాటు తగ్గకపోతే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.