Eggs: కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందుకే చాలామంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో గుడ్లను తప్పనిసరిగా చేర్చుకుంటారు. అయితే.. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణుల ప్రకారం, గుడ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.
గుడ్లతో కలిపి తీసుకోకూడని కొన్ని ప్రధాన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. చక్కెర :
గుడ్లు, చక్కెరను కలిపి వండటం లేదా తినడం అస్సలు మంచిది కాదు. ఈ రెండింటి కలయిక వల్ల శరీరంలో అమినో యాసిడ్లు విడుదలవుతాయి. ఇవి రక్తం గడ్డకట్టేలా చేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. ఇది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
2. సోయా పాలు:
చాలామంది ప్రోటీన్ కోసం గుడ్లు, సోయా పాలను కలిపి తీసుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. సోయా పాలలో ఉండే కొన్ని పదార్థాలు గుడ్డులోని ప్రోటీన్ (అల్బుమిన్) గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల మీరు ఆశించిన స్థాయిలో పోషకాలు అందకపోగా.. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. టీ, కాఫీ:
బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం మనలో చాలా మందికి అలవాటు. అయితే.. టీ ఆకుల్లో ఉండే టానిన్లు గుడ్డులోని ప్రోటీన్లను శరీరం గ్రహించకుండా చేస్తాయి. ఇది మలబద్ధకానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఎగ్ తిన్న తర్వాత కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి టీ తాగడం ఉత్తమం.
4. పాలు, పాల పదార్థాలు:
సాధారణంగా పాలు, గుడ్లు విడివిడిగా ఆరోగ్యకరం. కానీ పచ్చి గుడ్డును పాలలో కలిపి తాగడం లేదా పనీర్ వంటి పాల ఉత్పత్తులతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, కడుపు నొప్పికి కారణం కావచ్చు.
5. పుల్లని పండ్లు:
గుడ్లు తిన్న వెంటనే నిమ్మకాయ, నారింజ వంటి పుల్లని పండ్లను తీసుకోకూడదు. ఈ రెండింటి కలయిక వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి, గుండెల్లో మంట లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఉన్నట్టుండి బరువు తగ్గారా ? అస్సలు లైట్ తీసుకోవద్దు
6. మాంసం:
గుడ్డులో ఇప్పటికే అధిక మొత్తంలో ప్రోటీన్ , కొవ్వు ఉంటుంది. దీనిని మళ్ళీ అధిక కొవ్వు ఉన్న మాంసంతో (ఉదాహరణకు బేకన్ లేదా రెడ్ మీట్) కలిపి తీసుకుంటే.. అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల రోజంతా నీరసంగా లేదా బద్ధకంగా అనిపించవచ్చు.
ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ?
మన జీర్ణ వ్యవస్థ ఒక్కో రకమైన ఆహారాన్ని అరిగించుకోవడానికి ఒక్కో రకమైన ఎంజైమ్లను విడుదల చేస్తుంది. విరుద్ధ ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు, జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడి శరీరంలో టాక్సిన్స్ (విషతుల్యాలు) పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల చర్మ సమస్యలు, అలర్జీలు, దీర్ఘ కాలిక అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎగ్స్ తో కలిపి పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.