Oil Massage For Feet: వేసవి కాలంలో.. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల మన శరీరం లోపల కూడా వేడి పెరుగుతుంది. దీని వల్ల కళ్లు మండటం, నిద్ర లేమి, అరకాళ్ల మంటలు వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే.. మన పూర్వీకులు అనుసరించిన ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ‘పాదాల మసాజ్’. రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ పద్ధతి వెనక ఉన్న శాస్త్రీయత, ప్రయోజనాలను గురించి వివరంగా తెలుసుకుందాం.
శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మనం సాధారణంగా చల్లని డ్రింక్స్ తాగుతాం. కానీ.. బాహ్య చికిత్సల ద్వారా కూడా శరీరాన్ని అంతర్గతంగా చల్లబరచవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అందులో అతి ముఖ్యమైనది “పాద అభ్యంగం” లేదా పాదాల మసాజ్. మన శరీరంలోని అనేక నాడుల చివరలు పాదాలలో ఉంటాయని.. వాటిని సరైన పద్ధతిలో ప్రేరేపించడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థపై సానుకూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
1. ఆవు నెయ్యి మసాజ్ – ఒక సహజ శీతలీకరణి:
ఆయుర్వేదం ప్రకారం.. ఆవు నెయ్యికి ‘పిత్త’ దోషాన్ని తగ్గించే గుణం ఉంది. శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణం పిత్త దోషం అసమతుల్యత.
ఎలా చేయాలి?: రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని, తడి లేకుండా తుడవాలి. కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకుని పాదాల అడుగు భాగంలో వృత్తాకారంలో కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఫలితం: ఇది శరీరంలోని వేడిని లాగేసి, కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు పని చేసేవారికి ఇది దివ్యౌషధం.
2. కొబ్బరి నూనెతో కలిగే ప్రయోజనాలు:
ఒకవేళ మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే.. కొబ్బరి నూనె ఉత్తమ ప్రత్యామ్నాయం. కొబ్బరి నూనె సహజంగానే చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
ప్రయోజనం: వేసవిలో వచ్చే అరకాళ్ల మంటలను తగ్గించడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా.. పగిలిన మడమలను కూడా నివారిస్తుంది.
3. నిద్రలేమికి పరిష్కారం:
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పూట సరైన నిద్ర పట్టదు. పాదాల మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడి, మెదడులోని ఒత్తిడి తగ్గుతుంది. ఇది ‘మెలటోనిన్’ అనే హార్మోన్ విడుదలకు సహాయపడి.. గాఢంగా నిద్ర పట్టేలా చేస్తుంది. హాయిగా నిద్ర పోవడం వల్ల మరుసటి రోజు ఉదయం శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
Also Read: ఎండల నుంచి రక్షణ.. ఈ సమ్మర్ హ్యాక్స్ పాటిస్తే.. వడదెబ్బ మీ దరి చేరదు!
4. కళ్ల ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గింపు:
మన పాదాల అడుగు భాగంలో ఉండే కొన్ని పాయింట్లు కళ్లతో సంబంధం కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా నెయ్యితో మసాజ్ చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా.. కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవారికి ఈ ప్రక్రియ ఒక ‘నేచురల్ థెరపీ’లా పని చేస్తుంది.
5. పాటించాల్సిన జాగ్రత్తలు:
1. మసాజ్ చేసిన తర్వాత కాళ్లకు పాత సాక్సులు వేసుకోవడం మంచిది. దీని వల్ల నెయ్యి లేదా నూనె బట్టలకు అంటకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇది పాదాలకు వెచ్చదనం లభించి నూనె చర్మంలోకి బాగా ఇంకుతుంది.
2.మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి.
3.గర్భిణీలు లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒకసారి నిపుణులను సంప్రదించడం మంచిది.