DISCOM Issues: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతులకంటూ ఒక ప్రత్యేక డిస్కం అవసరమని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ విద్యుత్ రంగంలో కొత్తగా ఏర్పడిన రైతు డిస్కం ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. విద్యుత్ సంస్థకు చెందిన కొందరు అధికారులే మోకాలడ్డుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సొంత గూడు లేక, కనీస వసతులు కరువై ఇబ్బంది పడుతున్న రైతు డిస్కం అధికారులకు, తోటి విభాగం నుంచే అవమానాలు ఎదురవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు డిప్యూటేషన్ పై వచ్చే ఉద్యోగులను చేరనివ్వకుండా కొందరు బేరసారాలాడుతున్నట్లు విమర్శలు రాగా.. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. రైతు డిస్కంకు డిప్యూటేషన్ పై వెళ్లిన చీఫ్ ఇంజినీర్లపై ఎస్పీడీసీఎల్ కు చెందిన జీఎం స్థాయి అధికారి అవమానకరంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఆర్పీడీసీఎల్)కు సంబంధించి ఇంకా శాశ్వత భవనం ఏర్పాటు కాలేదు. దీంతో ప్రస్తుతం మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలోనే తాత్కాలికంగా ఒక ఫ్లోర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఎస్పీడీసీఎల్ నుంచి పలువురు రైతు డిస్కం కార్యాలయానికి డిప్యూటేషన్ పై వెళ్లారు. అప్పటి వరకు ఎస్పీడీసీఎల్ లో వారు చేపట్టిన విధులను ఇతర అధికారులకు అప్పగించారు. వారు తమకు గతంలో ఉన్న స్థానం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.
రైతు డిస్కంకు స్థలాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ నుంచి డిప్యూట్ అయిన ఉద్యోగులు తమ పాత స్థానం నుంచే విధులు చేపడుతుండగా జీఎం స్థాయి అధికారి చీఫ్ ఇంజినీర్లను ఇక్కడ కూర్చోవద్దని, రైతు డిస్కంకే వెళ్లాలని ఆదేశించి అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వచ్చాయి. దాదాపు 35 ఏండ్ల సర్వీస్ కలిగిన అధికారులతో ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం అవమానించడమే అవుతుందని చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఉద్యోగులందరికీ తెలియడంతో సదరు అధికారి ఏపీ మూలాలున్న వ్యక్తి కావడం వల్లే తెలంగాణకు చెందిన వారిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విద్యుత్ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న చీఫ్ ఇంజినీర్ల స్థాయి అధికారులనే అంత తక్కువ చేసి మాట్లాడటంపై తోటి ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also read: డ్యూటీలో ఉండి ఆ సీన్లు.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఏఎస్ఐ
మింట్ కాంపౌండ్ లోని ఎస్పీడీసీఎల్ లో మొత్తం ఏ, బీ, సీ, డీ.. నాలుగు బ్లాకులున్నాయి. ఎస్పీడీసీఎల్ సీఎండీకి బీ బ్లాక్ 5వ ఫ్లోర్ లో ఛాంబర్ ఉంది. అయితే ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న ముషారఫ్ ఫరూఖీని ఆర్పీడీసీఎల్ కు బదిలీచేశారు. అయితే ఆర్పీడీసీఎల్ కు ప్రత్యేకించి కార్యాలయం లేకపోవడంతో బీ బ్లాక్ 5వ అంతస్తులో 2000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం గల స్థలం నుంచే పరిపాలన సాగుతోంది. ఆ స్థలంలోనే ఒక సీఎండీ, సీఎండీ కార్యాలయం, నలుగురు చీఫ్ ఇంజినీర్లు, ఇద్దరు జనరల్ మేనేజర్లు, ఇటీవల డిప్యూట్ అయిన పలువురు ఉద్యోగులు కార్యకాలపాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాయ భేదాల వల్ల ఢీ అంటే ఢీ అనే రీతిలో కొట్లాడుకున్న విద్యుత్ ఉద్యోగులు సైతం రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సౌధలో ఎలాంటి సమస్యల్లేకుండా దాదాపు ఐదేండ్ల పాటు కొనసాగారు. అలాంటిది ప్రత్యేక రాష్ట్ర సిద్ధించాక కూడా ప్రాంతీయ బేధాలు సృష్టించే ప్రయత్నం చేయడంపై విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తోటి ఉద్యోగులతో అమానుషంగా, అవమానకరంగా వ్యవహరించడంపై మింట్ కాంపౌండ్ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
రైతు డిస్కం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచలేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త బిల్డింగ్ ఏర్పాటు అయ్యే వరకు ఎస్పీడీసీఎల్ లోనే కొనసాగాల్సి ఉండగా.. ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకావడం అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. డిస్కంలలో సమస్యలను సీఎండీలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నా.. ఒకరిద్దరు అధికారుల తీరువల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోగా మరింత సంక్లిష్టమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల మధ్య జరిగిన ఈ వివాదాలకు యాజమాన్యాలు వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని పలువురు ఉద్యోగులు భావిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే గొడుగు కింద పనిచేస్తూ, ఇలాంటి వివక్ష చూపడంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: నల్లగొండ పాలిటిక్స్లో పెను మార్పులు.. కోమటిరెడ్డి నిర్ణయంపైనే అందరి కళ్లు!