Body Pains: ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపించేవి. కానీ, నేడు 20, 30 ఏళ్ల వయసున్న ఐటీ ఉద్యోగులు, ఇతర యువ నిపుణులు సైతం మెడ నొప్పి, నడుము పట్టేయడం, చేతులు గుంజడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఆధునిక జీవనశైలి, నిరంతర పని ఒత్తిడి వల్ల ఈ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
నేటి తరం యువత రోజులో ఎక్కువ భాగం లాప్టాప్లు, మొబైల్ స్క్రీన్ల ముందే గడుపుతున్నారు. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల వెన్నుపూస, కండరాలు, కీళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. నడక లేదా కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ చిన్న వయసులోనే కండరాలు బలహీనపడి, దీర్ఘకాలిక నొప్పులుగా మారుతున్నాయి.
Also Read: టైప్ చేసే పనిలేదు.. Google Gemini 3.5తో మాట్లాడితే చాలు, క్షణాల్లో 70 భాషల్లోకి అనువాదం!
కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్స్ పెరిగిపోయాయి. చాలామంది ఆఫీస్ కుర్చీలను కాదని మంచాలు, సోఫాలపై కూర్చుని వంగి పనిచేస్తున్నారు. సరైన సిట్టింగ్ పొజిషన్ లేకపోవడం, స్క్రీన్ కంటి చూపునకు సమానంగా లేకపోవడం వల్ల మెడ, భుజాల నొప్పులు తీవ్రమవుతున్నాయి. ఈ చిన్న నిర్లక్ష్యమే భవిష్యత్తులో పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.
శారీరక కారణాలే కాకుండా.. ఆఫీస్ డెడ్లైన్లు, మానసిక ఆందోళనలు కూడా ఒంటి నొప్పులకు కారణమవుతున్నాయి. మానసిక ఒత్తిడి వల్ల కండరాలు బిగుసుకుపోయి తలనొప్పి, దవడ నొప్పి, భుజాలు పట్టేయడం వంటివి జరుగుతాయి. ఆఫీస్ పని ముగిసిన తర్వాత కూడా ఫోన్లు చూస్తూ గడపడం వల్ల శరీరానికి కోలుకునే సమయం దొరకడం లేదు.
చాలామంది నొప్పులు రాగానే తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడటం లేదా బామ్స్ రాయడం చేస్తుంటారు. కానీ, సమస్య మూలాలను మార్చకపోతే ప్రమాదం పెరుగుతుంది. ఇప్పుడు యువతలో కూడా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవడం, స్ట్రెచింగ్ చేయడం, సరైన ఎర్గోనామిక్ కుర్చీలను వాడటం అలవాటు చేసుకుంటున్నారు. నొప్పుల నివారణకు ఇన్ఫ్రారెడ్ థెరపీ వంటి సరికొత్త పరికరాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఏదేమైనా, జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే దీనికి సరైన పరిష్కారం.
Also Read: భారీ బ్యాటరీ, ఐఫోన్ను మించిన ఫీచర్లతో Redmi Turbo 5 లాంచ్.. ధర ఎంతంటే?