Oral Cancer:ఓరల్ క్యాన్సర్.. నోటి క్యాన్సర్ కి భారతదేశం పుట్టినిల్లు లాంటిది అని పలువురు ప్రముఖులు ప్రస్తావిస్తూ ఉంటారు. ముఖ్యంగా గుట్కా, కైనీ , తంబాకు వంటివి కేవలం భారత దేశంలో మాత్రమే విక్రయిస్తున్నారు. నిజానికి ఏ దేశంలో కూడా వీటి విక్రయం ఉండదు. ముఖ్యంగా వీటి నుంచి నోటి క్యాన్సర్ వస్తుందని ఫేషియల్ సర్జన్ డాక్టర్ దిలీప్ తెలిపారు. ఎంతో ప్రమాదకరమైన ఈ క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తిస్తే వైద్యం చేయడం సులభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇండియాలో చాలావరకు యువత ఈ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఎంతో భవిష్యత్తు ఉన్నవారు ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటే మొదటి దశలోనే వైద్యుడిని సంప్రదిస్తే.. వెలస్కోప్ ద్వారా ఈ నోటి క్యాన్సర్ ను గుర్తించవచ్చని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్ గుర్తించిన తర్వాత వైద్యం చేసి , ప్రాణాలను రక్షించవచ్చు అని డాక్టర్ దిలీప్ వివరించారు.
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల క్రితం 21 సంవత్సరాల అబ్బాయికి నోటి క్యాన్సర్ ఉండడంతో షాక్ అయ్యాను. వక్కలు తినడం, పొగాకు నమలడం, బీడీ, గుట్కా , సిగరెట్ ఇలా మత్తు పదార్థాలను సేవించడం ద్వారా ఈ నోటి క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. నొప్పి ఉండదు కాబట్టి దీనిని గుర్తించడం వ్యక్తులకు పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. నోటిలో ఏదైనా సరే అసాధారణంగా అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల మొదటి దశలోనే ఓరల్ క్యాన్సర్ ను పసిగట్టవచ్చు. దీంతో వైద్యం సులభం అవుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. దీనిపై అవగాహన కల్పించడానికి ‘గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్’ని కూడా ఏర్పాటు చేశాం అంటూ ఆయన స్పష్టం చేశారు.
also read:ప్రియుడితో బ్రేకప్.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ!
ముఖ్యంగా గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మారథాన్ నిర్వహిస్తారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సంవత్సరం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా మారథాన్ కార్యక్రమాన్ని చేశారు. ఓరల్ క్యాన్సర్ ను నివారించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను చేపట్టబోతున్నామని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా దీని గురించి వివరించి, వారి సేవలను ఉపయోగించుకొని, ప్రజలలో మరింత అవగాహన కార్యక్రమాన్ని పెంచుతామని డాక్టర్ దిలీప్ స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే ప్రముఖ భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ నోరీ దత్తాత్రేయుడు కలవడం జరిగింది. ట్రస్టు ద్వారా చేస్తున్న పనులను ఆయన కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేస్తూ భారతీయులకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. దీనికోసం తనకు సాధ్యమైనంత సహాయం కూడా చేస్తానని తెలిపారు అంటూ దిలీప్ స్పష్టం చేశారు. అలాగే తెలుగు సినిమా నటుడు రాజా రవీంద్రను కూడా కలవడం జరిగింది. సినిమా మాధ్యమం ద్వారా కూడా దీనిపై అవగాహన పెంచాలని, అందుకు పరిశ్రమ నుంచి తగిన ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అంటూ డాక్టర్ దిలీప్ వెల్లడించారు.