Nirav Modi: బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద స్కాంలలో ఒకటి… 2018 – పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ కలిసి దాదాపు రూ.13 వేల కోట్ల మేర బ్యాంకును ముంచారు. ముంబైలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్లో కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై SWIFTను దుర్వినియోగం చేశారు. వేల కోట్ల విదేశీ బ్యాంకు రుణాలు పొందారు. 2018 జనవరి 1న దేశం విడిచి పారిపోయాడు. జనవరి 29న పీఎన్బీ ఫిర్యాదు చేయడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.
భారత్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్
ఈ కేసులో ఈడీ 2,600 కోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. పలు అభియోగాలు మోపింది. దీంతో 2019లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి యూకే జైలులోనే ఉన్నాడు. నీరవ్ను స్వదేశానికి రప్పించేందుకు భారత్ యూకేపై అన్ని కోణాల్లో ఒత్తిడి పెంచింది. నీరవ్ మాత్రం.. భారత్కు రాకుండా ఉండేందుకు మానసిక ఆరోగ్యం, జైలు పరిస్థితులు, మానవ హక్కుల పేరుతో కోర్టులను ఆశ్రయించాడు. కోర్టులు అతని వాదనలను తిరస్కరించాయి. 2021 ఫిబ్రవరి 25న వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ను భారత్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూకే హోం సెక్రటరీ కూడా ఆమోదం తెలిపారు. చివరి అవకాశంగా నీరవ్ మోదీ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించినా రిలీఫ్ దక్కలేదు. సో..అతడిని భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయింది.
ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా.. వేటాడుతుంది
నీరవ్ మోదీ భారత్కు వస్తే… అది అతడికి మాత్రమే పరిమితం కాదు, దేశాన్ని మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులకు గట్టి హెచ్చరిక. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా.. భారత్ వేటాడుతుందని పంపే సంకేతం..సందేశం కూడా.
Also Read: తాజ్మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?