CM Revanth Reddy: పరిపాలనలో మరింత పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులకు సూచించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 4800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. ఇందులో 4300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.
దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు. ఇందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీ 100 రోజుల్లో ఈ అంశాన్ని కొలిక్కి తీసుకు రావాలని ఆదేశించారు.
Also Read: భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!
మరోవైపు హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిలైజ్ చేయాలన్నారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!