Sugar patients: డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి పాదాల సంరక్షణ అనేది అత్యంత కీలకం. రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు అది పాదాలకు రక్త ప్రసరణను తగ్గించడమే కాకుండా, నరాల దెబ్బతినడానికి దారితీస్తుంది. దీని వల్ల పాదాలకు ఏదైనా గాయం లేదా పుండు పడితే నొప్పి తెలియదు. అది త్వరగా మానదు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇన్ఫెక్షన్లకు, తీవ్రమైన సందర్భాల్లో పాదాలను తొలగించాల్సిన పరిస్థితికి దారి తీయవచ్చు. అందుకే డయాబెటిక్ రోగులు తమ పాదాల విషయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోజువారీ చిట్కాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
డయాబెటిస్ రోగుల కోసం ముఖ్యమైన పాదాల సంరక్షణ చిట్కాలు:
1. ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకోండి :
మధుమేహం ఉన్నవారికి పాదాల అడుగు భాగంలో నొప్పి తెలియకపోవచ్చు. అందుకే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలను క్షుణ్ణంగా చెక్ చేయాలి.
ఏమి గమనించాలి: పాదాలపై ఏవైనా ఎర్రటి మచ్చలు, బొబ్బలు , కోతలు, గీతలు లేదా గోళ్లు లోపలికి వెళ్లడం వంటివి ఉన్నాయో లేదో చూడాలి. అవసరమైతే పాదాల అడుగు భాగం చూడటానికి ఒక అద్దాన్ని ఉపయోగించండి.
2. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచండి :
పాదాల పరిశుభ్రత ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
పద్ధతి: ప్రతిరోజూ గోరు వెచ్చని నీరు, మైల్డ్ సోప్తో పాదాలను కడగాలి. కడిగిన తర్వాత వేళ్ల మధ్య సందుల్లో తేమ లేకుండా మెత్తని తువ్వాలుతో శుభ్రంగా తుడుచుకోవాలి. తేమ ఉంటే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
3. పాదరక్షల ఎంపికలో జాగ్రత్త:
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ ఖాళీ పాదాలతో నడవకూడదు. ఇంట్లో కూడా..
చిట్కా: సరిగ్గా సరిపోయే.. మెత్తని సోల్ ఉన్న బూట్లు లేదా చెప్పులు ధరించాలి. బిగుతుగా ఉండే పాదరక్షలు రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. బూట్లు వేసుకునే ముందు వాటిలో ఏవైనా చిన్న రాళ్లు లేదా పదునైన వస్తువులు ఉన్నాయో లేదో తప్పక చూసుకోవాలి.
4. గోళ్లను జాగ్రత్తగా కత్తిరించుకోండి:
గోళ్లు కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పద్ధతి: గోళ్లను తిన్నగా కత్తిరించాలి, మూలల్లో లోతుగా కత్తిరించకూడదు. దీని వల్ల గోళ్లు చర్మంలోకి గుచ్చుకోకుండా ఉంటాయి. గోళ్లు కత్తిరించేటప్పుడు చర్మం తెగితే వెంటనే డాక్టర్ ని తప్పకుండా సంప్రదించాలి.
5. చర్మం పొడిబారకుండా చూసుకోండి:
పాదాల చర్మం పగిలితే బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది.
జాగ్రత్త: పాదాల పైన, అడుగున లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాయండి. కానీ, వేళ్ల మధ్య సందుల్లో లోషన్ రాయకండి. అక్కడ తేమ ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
6. రక్త ప్రసరణను మెరుగుపరచండి :
పాదాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూసుకోవాలి.
అలవాట్లు: కూర్చున్నప్పుడు పాదాలను కదిలిస్తూ ఉండండి. ఎక్కువ సేపు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకండి. ధూమపానం మానేయాలి. ఎందుకంటే పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి పాదాలకు రక్త సరఫరా తగ్గుతుంది.
Also Read: జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే శరీరం ఇచ్చే హెచ్చరికలు ఇవే.. జాగ్రత్త!
7. వేడిని పరీక్షించండి :
నరాల బలహీనత వల్ల పాదాలకు వేడి తెలియదు.
హెచ్చరిక: స్నానం చేసే నీరు మరీ వేడిగా ఉండకూడదు (చేతితో ముందే పరీక్షించండి). హీటింగ్ ప్యాడ్లు లేదా వేడి నీళ్ల బాటిళ్లను నేరుగా పాదాలకు తగిలించకూడదు. దీని వల్ల మీకు తెలియకుండానే చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది.
డయాబెటిస్తో జీవించేటప్పుడు చిన్న గాయం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే ‘చికిత్స కంటే నివారణ మేలు’ అనే సూత్రాన్ని పాటించాలి.