Eating Habits: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదు. ఆ ఆహారాన్ని ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలో కూడా తెలుసుకోవడం అత్యంత అవసరం. కేవలం పోషకాలు కూడిన ఆహార పదార్థాలపైనే దృష్టి పెట్టకుండా.. భోజనం ఏ విధంగా చేయాలి, ఎలా తీసుకుంటున్నామో కూడా తెలుసుండాలి అంటున్నారు వైద్య నిపుణులు. అయితే, ఇలాంటి నియమాలను పాటించడంలో చాలామంది అలసత్వం వహిస్తున్నారు. అందుకే భోజనం చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
తినేటప్పుడు చాలామంది ఫోన్, టీవీ లేదా ల్యాప్టాప్ చూస్తూ.. వేరే పనిలో నిమగ్నమై తింటుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినడం చాలా ముఖ్యం. పూర్వీకులు నేల మీద కూర్చొని తినేవారని, అందుకే వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారని చెబుతున్నారు. నేల మీద కూర్చోవడం వల్ల కడుపు మీద ఒత్తిడి పడి జీర్ణశక్తిని మెరుగు చేస్తుంది.
చాలామంది భోజనం చేసిన వెంటనే ఇంకో స్నాక్ తింటారు లేదా పెద్ద మోతాదులో నీళ్లు తాగుతారు. కానీ భోజనం తర్వాత కనీసం 3 నుంచి 4 గంటల విరామం తర్వాత ఏదైనా తినడం ఉత్తమం. అలాగే ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు కాకుండా కొద్దిగా కొద్దిగా తాగడం మేలు. దీంతోపాటు రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించడం కూడా ఆరోగ్యానికి మంచిది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు.
పెద్ద ప్లేట్లో అన్నం, కూరగాయలు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లను సమానంగా తీసుకోవాలి. దీని కోసం కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్లు సగం ప్లేటు వరకు ఉండాలి. మిగతా సగంలో 25 శాతం ప్రొటీన్, 15 శాతం కార్బోహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే అది హెల్దీ ప్లేట్ అవుతుంది.
నోట్లో ముద్ద పెట్టుకున్న వెంటనే గుటుక్కుని మింగడం సరికాదు. ప్రతి ముద్దనూ నిదానంగా 15 నుంచి 20 సార్లు నమిలి మింగడం ఆరోగ్యానికి మంచిది. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో పొట్ట మీద ఒత్తిడి తగ్గుతుంది. వేగంగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు నిపుణులు.