Earthen Pot Water: అమ్మ బాబోయ్.. ఈ ఎండలేంట్రా బాబు ఇలా మండిపోతున్నాయ్.. ప్రస్తుతం చాలామంది నోట వినిపించే మాట ఇదే. ఈ ఎండలకి కాలు బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది. సరే, హాయిగా ఇంట్లో కూర్చుందామంటే ఆ వేడి గాలులు, విపరీతమైన చెమట అస్సలు ఊపిరి ఆడనీయడం లేదు. ఇలాంటప్పుడు మనలో చాలామందికి ఫిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ని తాగాలనిపిస్తుంటుంది. చల్లగా ఉంది కదా అని మనం ఫ్రిడ్జ్ నీళ్లకు అలవాటు పడిపోతున్నాం కానీ, అది మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలుసా? గొంతు నొప్పి నుంచి జీర్ణ సమస్యల వరకు అన్నీ ఈ అలవాటు వల్లే వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి మన అమ్మమ్మలు, తాతయ్యలు ఆ కాలంలో ఫ్రిడ్జ్ లేకపోయినా అంత హుషారుగా ఎలా ఉండేవారో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ల ఆరోగ్య రహస్యమంతా ఆ మూలన ఉన్న మట్టి కుండలోనే ఉండేది. కుండ నీళ్లు తాగడం వల్ల కేవలం దాహం తీరడమే కాదు, అంతకు మించిన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నేటి పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మట్టి కుండలో నీళ్లెందుకు తాగాలి? మట్టికుండ నీటిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
మట్టి కుండలో ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల ద్వారా నీరు నెమ్మదిగా ఆవిరవుతూ ఉంటుంది. దీనివల్ల లోపల ఉన్న నీరు సహజ సిద్ధంగా చల్లబడుతుంది. ఫ్రిడ్జ్ నీరు మన శరీరానికి ఒక్కసారిగా షాక్ ఇస్తే, కుండ నీరు శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉండి ప్రాణశక్తిని ఇస్తుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మట్టికి ఆల్కలైన్ గుణం ఉంటుంది. ఇది మన శరీరంలోని అసిడిటీని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ నీరు ఔషధంలా పనిచేస్తుంది.
Also Read: బరువు తగ్గాలన్నా, గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజుకో దానిమ్మ తినాల్సిందేనా?
శాస్త్రీయ కోణంలో చూస్తే.. మట్టి కుండ కేవలం నీటిని చల్లబరచడమే కాకుండా, ఒక సహజ ఫిల్టర్లా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నీటిలోని హానికరమైన బ్యాక్టీరియాను, మలినాలను తొలగించడమే కాకుండా, నీటికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను సహజంగానే జోడిస్తుంది. అందుకే ఈ నీరు తాగడానికి ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు, గొంతు నొప్పి లేదా దగ్గు ఉన్నవారికి ఫ్రిడ్జ్ నీరు శాపంగా మారితే, కుండ నీరు గొంతుకు ఎంతో హాయిని ఇస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచడానికి, శరీర మెటబాలిజం వేగవంతం చేయడానికి ఈ అలవాటు ఎంతగానో తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
చాలామందికి వచ్చే పెద్ద సందేహం.. ఎర్ర కుండ కొనాలా లేక నల్ల కుండనా? అని. నిజానికి రెండూ మంచివే, కానీ చిన్న తేడా ఉంది. ఎర్రటి మట్టి కుండలో రంధ్రాలు కాస్త పెద్దవిగా ఉండటం వల్ల నీరు చాలా త్వరగా చల్లబడుతుంది. అయితే, నల్లటి కుండను ప్రత్యేకమైన పద్ధతిలో కాల్చడం వల్ల దాని గోడలు మందంగా ఉండి, నీటిని ఎక్కువ సమయం పాటు చల్లగా ఉంచగలవు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నల్ల కుండను ఎంచుకోవడం ఉత్తమం. ఇది బయటి వేడిని లోపలికి రానివ్వకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
మట్టి కుండ తెచ్చుకున్నప్పుడు కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకోవాలి. కొత్త కుండను కొన్నప్పుడు కనీసం రోజంతా నీటిలో నానబెట్టి, ఆ తర్వాతే వాడటం మొదలుపెట్టాలి. శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా సబ్బు గానీ, డిటర్జెంట్లు గానీ వాడకూడదు. ఎందుకంటే.. మట్టిలోని రంధ్రాలు ఆ రసాయనాలను పీల్చుకుని నీటిని కలుషితం చేస్తాయి. కేవలం మంచినీటితో కడిగితే సరిపోతుంది. ఈ ఎండాకాలం ఆ ప్లాస్టిక్ బాటిళ్లను పక్కన పెట్టి, ప్రకృతి సిద్ధమైన మట్టి కుండను ఇంట్లో పెట్టుకోండి. నేటి నుంచే మట్టికుండ నీటిని తాగడం ప్రారంభిస్తే.. ఆ అద్భుతమైన రుచిని, ఆరోగ్యాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు.
Also Read: డయాబెటిస్ పేషెంట్లకు వరం ఈ జొన్న గుగ్గిళ్లు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!